కరోనా కూడా ఇప్పుడేనా…. ఇదేం ఖర్మ?

JN1-Virus

దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కొత్త వేరియెంట్ జేఎన్-1 కేసులు నమోదవడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మళ్ళీ అన్ని రాష్ట్రాలు కోవిడ్ పరీక్షలు, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ మళ్ళీ మాస్కులు ధరించాలని సూచించింది.

జేఎన్-1 కొత్త వేరియెంట్ పాత వెరియంట్స్ కంటే కాస్త ప్రమాదకరమైనదని వేగంగా వ్యాప్తి చెందుతుందని, సరైన ముందస్తు జాగ్రత్త చర్యలు, సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ ముందుగా అదే స్పందించింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు సంబందించి సమీక్షా సమావేశాలను, అన్ని నిర్ణయాలను సిఎం జగన్మోహన్‌ రెడ్డే నిర్వహిస్తుంటారు. కనుక ఆ శాఖ మంత్రి విడదల రజని ఇంకా పని మొదలుపెట్టిన్నట్లు లేరు.

గత అనుభవాలను బట్టి చూస్తే కరోనా కొత్త వేరియెంట్ ప్రారంభమైన తర్వాత వ్యాప్తి చెంది ఉదృతంగా మారడానికి సుమారు 2-3 నెలలు సమయం పడుతుంది. ఆ లెక్కన ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయానికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చన్న మాట! కనుక కరోనా వ్యాప్తిని అరికట్టడం జగన్‌ ప్రభుత్వానికి చాలా చాలా అవసరం.

ఎందుకంటే ఇన్నేళ్ళుగా సంక్షేమ పధకాల పేరుతో అప్పులు తెచ్చి మరీ ఓటర్లకు డబ్బు పంచిపెట్టాక ఇప్పుడు కరోనా కారణంగా వారందరూ వచ్చి ఓట్లు వేయకపోయినా, ఆ కారణంగా పోలింగ్ తగ్గినా, ఒకవేళ ఎన్నికలు వాయిదా పడినా కూడా వైసీపికి తీరని నష్టం కలగవచ్చు.

అయితే గతంలో రెండుసార్లు కరోనా మహమ్మారిని మహాద్భుతంగా… దేశానికే ఆదర్శంగా కట్టడి చేశామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది కనుక ఈసారి నిజంగానే కరోనాను కట్టడి చేసి చూపించాల్సి ఉంటుంది. లేకుంటే అన్ని దెబ్బలతో పాటు వైసీపికి కరోనా దెబ్బ కూడా తప్పకపోవచ్చు. ఇదేం ఖర్మ అనిపిస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories