ఎన్నికలలో గెలవాలని, అధికారంలోకి రావాలని ప్రతీ రాజకీయ పార్టీ, నాయకుడు కోరుకొంటారు. అది సహజం. కానీ బోడి గుండుకి మోకాలుకి ముడివేయాలని చూసిన్నట్లు, ప్రతీ దానిని అదే కోణంలో చూస్తూ అదో గొప్ప ‘వ్యూహం’ అనుకోవడమే వెర్రితనం.
గత ఎన్నికలకు ముందు జరిగిన ‘కోడి కత్తి’ కేసుని కూడా వైసీపి ఆవిదంగానే వినియోగించుకొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడితో ఆ కేసుని విడిచిపెట్టేసి ఉంటే జనాలు అప్పుడే దాని గురించి మరిచిపోయి ఉండేవారు. కానీ ఆ కేసులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పినా, జగన్ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. ఎన్ఐఏ కూడా కనుగొనలేని పెద్ద కుట్ర ఏదో ఆ కేసులో ఉందంటూ నేటికీ దానిని కొనసాగిస్తూనే ఉంది.
అందువలన ఈ కేసులో నిందితుడైన దళిత యువకుడు శ్రీను 5 ఏళ్ళుగా జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గుతూనే ఉన్నాడు.
రాజీవ్ గాంధీని అతి దారుణంగా హత్య చేసిన హంతకులను సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు క్షమించారు. కానీ కోడి కత్తితో భుజంపై చిన్న ఘాటు పెట్టిన దళిత యువకుడు శ్రీనుని మాత్రం నా దళితులని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి క్షమించలేకపోతున్నారు.
ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు జరపాలని కోరుతూ జగన్ తరపున న్యాయవాదులు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేస్తే, జూలై 25న విచారణ జరిపి దానిని కొట్టివేసింది. దాంతో జగన్ తరపు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని ఎన్ఐఏ మరోసారి హైకోర్టుకి తెలియజేసింది. కనుక జగన్ పిటిషన్ను కొట్టివేయాలని ఎన్ఐఏ న్యాయవాదులు కోరగా, ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు జడ్జీలతో కూడిన బెంచ్ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను8 వారాలకు వాయిదా వేస్తూ అంతవరకు ఎన్ఐఏ కోర్టు తీర్పుపై స్టే విధించింది.
సంక్షేమ పధకాలే తమ ప్రభుత్వాన్ని 175 సీట్లతో గెలిపిస్తాయని జగన్ నిజంగా నమ్ముతున్నట్లయితే, ఇలాంటి కేసులను కూడా ఎన్నికల వరకు సాగదీస్తుండటం దేనికి?ఈ కోడికత్తి ఘటనతో గత ఎన్నికలలో ప్రజల సానుభూతి లభించి ఉండవచ్చు. కానీ ఆ కేసుని ఇంకా సాగదీస్తున్నకొద్దీ కోర్టులలో ఇలా ఎదురుదెబ్బలు తగులుతుంటే, పోయేది తమ పరువే అని గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఈ కేసును కొనసాగించడం ద్వారా ఆయన ఏమి సాధించాలనుకొంటున్నారో తెలీదు. బహుశః చంద్రబాబు నాయుడే ఈ కుట్రకు సూత్రధారి అని చెప్పాలనుకొంటున్నారా?




