ఎపిలో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు పెట్టాలని హైకోర్టు సూచించింది. ప్రజారోగ్యం ముఖ్యమే, అలాగే ఎన్నికలు ముఖ్యమేనని పేర్కొంది. హై కోర్టు సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుని ధర్మాసనం కొట్టి వేసింది. దీనితో అనుకున్న ప్రకారం రేపు మొదటి విడత ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది.
అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో లంచ్మోషన్ పిటీషన్ వెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అయితే ఒకవేళ తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహాయనిరాకరణ చేసే ఆలోచనలో ఉందట. “మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం. నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదు,” అని మంత్రి పేర్ని నాని చెప్పడం విశేషం.
“నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర ఇది,” అని మరో మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. అయితే సుప్రీం కోర్టు కూడా ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అనవసరంగా తెగేదాకా లాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ కు సహాయనిరాకరణ అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది. కోడ్ అమలు కాదు అని చెప్పడమే ఇందుకు నిదర్శనం.
అప్పుడు ప్రభుత్వం అస్తిత్వానికే ప్రమాదం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు నాయుడు మనిషిగా చూస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనను సాగనంపాలని చూసి భంగపడింది. ఆయన అధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే… తమ అంగ బలం అర్ధబలం ఉపయోగించడం కుదరదని ఆయన రిటైర్ అయ్యాకే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.





