దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన, చాలా ఆలోచించదగ్గ విషయం చెప్పారు.
ఈసారి లోక్సభ ఎన్నికలలో తనను ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారని, కానీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సరిపడా డబ్బు తన వద్ద లేనందున పోటీ చేయలేనని చెప్పానని ఆమె చెప్పారు.
కేంద్రమంత్రిగా తన జీతం, పొదుపు చేసుకొన్న సొమ్ము, కొద్దిపాటి ఆస్తిపాస్తులు తప్ప తన వద్ద పెద్దగా డబ్బు లేదని చెప్పారు. కనుక ఎన్నికలలో పోటీ చేయలేనని చెపితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అర్దం చేసుకున్నారని ఆమె చెప్పారు.
ఇదీగాక ఏపీ, తమిళనాడు రెండు రాష్ట్రాలలో కూడా ప్రజలు కులం, మతం వంటి అప్రాధాన్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తుంటారని, కనుక అందుకు తగ్గట్లు తాను రాజకీయాలు చేసి నెగ్గుకు రాలేనని నిర్మలా సీతారామన్ అన్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను శాశిస్తున్న వ్యక్తి నిర్మలా సీతారామన్. అంతకు ముందు ఆమె తొలి మహిళా రక్షణ మంత్రిగా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఆమె ఇంకా అనేక కీలక పదవులు చేపట్టి తన సమర్దత నిరూపించుకున్నారు. అందుకే ఆమె ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలలో ఒకరని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ఇంత అత్యున్నతమైన పదవిలో ఉంటూ కూడా ఆమె ఎంత నిరాడంబరంగా ఉంటారో అందరికీ తెలుసు.
ఆమె దేశ ఆర్ధిక వ్యవస్థను శాశిస్తున్న కారణంగా, కనుసైగ చేస్తే కోట్లు కుమ్మరించి ఆమెను గెలిపించేందుకు అనేక కార్పొరేట్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. కానీ ఆమె అటువంటి ఆలోచన కూడా చేయరు కనుకనే ఇంత వరకు ఆమెపై ఒక్క విమర్శ, ఆరోపణ కూడా వినిపించలేదు.
అయితే లోక్సభ ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని, అవి సామాన్యులు ఎవరూ పోటీ చేయలేని స్థితికి చేరుకున్నాయని ఆమె చెప్పకనే చెప్పారు.
ఈరోజుల్లో గల్లీ స్థాయి వార్డు మెంబర్లు, కారోరేటర్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పోగేసుకొంటూ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఎదిగిపోతున్నారు. హత్యలు చేసినవారు, వారిని ప్రోత్సహించేవారు, జైలుకి వెళ్ళి వచ్చినవారు కూడా నిర్భయంగా ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మాకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రిగా దేశ ఆర్ధిక వ్యవస్థను శాశిస్తున్న నిర్మలా సీతారామన్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు. ఎక్కడ ఉంది లోపం?వ్యవస్థలోనా… సమాజంలోనా?




