10 లక్షలు ఆదాయం దాటిన వారు గ్యాస్ సబ్సిడీని స్వచ్చంధంగా వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది ఇప్పటికే వదులుకున్నప్పటికీ, ఈ జాబితా ఇంకా చాలా ఉందని తేలడంతో, ఇక వారి పట్ల వేచిచూసే ధోరణిని పక్కన పెట్టింది.
2016, జనవరి 1వ తేదీ నుండి 10 లక్షలు వార్షిక ఆదాయం మించిన వారికి గ్యాస్ సబ్సిడీ ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం ‘కానుక’గా మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవ పరిస్థితులను గమనిస్తే… 10 లక్షల ఆదాయం దాటిన వారికి గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడం సమర్థనీయమైన విషయమే. అంతటి సంపాధన కలిగిన వారికి ఒక వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ బండను కొనుగోలు చేయడం పెద్ద విషయం కాదు. విపక్షాలు ఎంతగా గోల చేస్తున్నప్పటికీ, దీనిపై మోడీని ప్రశంసించి తీరాలి.
అయితే, ఇదే సమయంలో ఆ ఎత్తివేసిన సబ్సిడీతో మిగిలిన వారికి ఇచ్చే గ్యాస్ రేటును తగ్గించినట్లయితే, మోడీ తీసుకున్న నిర్ణయానికి బహుశా ప్రతిపక్షాలు కూడా ‘జిందాబాద్’ కొట్టాల్సిన పరిస్థితి తలెత్తేదేమో! అలా కాకుండా ఎత్తివేసిన సబ్సిడీని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ ‘లాజిక్’ను అందిపుచ్చుకోవడంలో మోడీ మిస్సయ్యాడనేది రాజకీయ విశ్లేషకుల మాట.





