నలుగురు ఎమ్మెల్యేల జంపింగ్ తో సతమతమైన జగన్, ఆ ఉదంతం నుండి కోలుకోక ముందే మరో ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుండే మరొకరు ‘సైకిల్’ బాట పట్టడం వైసీపీ వర్గాలకు మరింత షాకింగ్ ను ఇచ్చే అంశం. దీంతో సొంత జిల్లాలోనే జగన్ కు పట్టు లేదన్న విషయం మరోసారి బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఆ నలుగురు తప్ప మిగతా ఎవరూ టిడిపిలో చేరరని, మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు ‘హ్యాట్సాఫ్’ అంటూ జగన్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే కడప జిల్లా, బద్వేల్ ఎమ్మెల్యే త్రివేది జయరాములు ‘పసుపు’ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే కడప జిల్లా నుండి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరగా, తాజాగా బద్వేల్ కూడా ఈ జాబితాలో చేరింది.
ఇదిలా ఉంటే, నేడు కడప జిల్లా పర్యటనకు నారా లోకేష్ వెళ్తుండడంతో మరికొంత మంది సైకిల్ ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర నుండి కూడా పలువురు టిడిపిలో చేరడం ఖాయం అన్న సమాచారం రాజకీయ, మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు బలహీనంగా ఉన్న కడప జిల్లలో బలోపేతం కావడమే లక్ష్యంగా టిడిపి అడుగులు పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.





