ఇంతకాలం పాక్ ప్రేరిత ఉగ్రవాదంతో భారత్ బాధపడుతూ ఉండేది. నేటికీ పాక్ ఉగ్రవాదులు కాశ్మీర్లో ఉన్నారనేందుకు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ తాజా నిదర్శనం. కనుక పాక్ ఉగ్రవాదులను పెంచి పోషించడం, వారిని భారత్పైకి ఉసిగొల్పడం, ప్రజల ప్రాణాలు బలిగొనడం సరికాదని భారత్ హితవు చెపుతూనే ఉంది కానీ పాక్ పాలకులు పట్టించుకోలేదు. పైగా భారత్ని దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కనుక పాక్ ప్రేరిత ఉగ్రవాదులను, వేర్పటువాదులను ఎదుర్కొనేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తూనే ఉంది. వేల మంది ప్రజలు, సిపాయిల ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆగడాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. లేకుంటే మరోసారి దాడి తప్పదని భారత్ తీవ్రంగా హెచ్చరించినందునే పాక్ కాస్త వెనక్కు తగ్గిందని చెప్పవచ్చు.
ఇంతకాలం భారత్తో చలగాటం ఆడిన పాకిస్తాన్కు ఇప్పుడు అఫ్ఘనిస్తాన్తో సరిగ్గా ఇటువంటి సమస్యే ఎదురవు తుండటంతో తీవ్ర అసహనంగా ఉంది.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేడు ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి పాక్-అఫ్ఘనిస్తాన్ మద్య కాల్పుల విరమణ, శాంతి చర్చలు విఫలమైతే తాలిబన్లతో ప్రత్యక్ష యుద్ధం ఆరంభించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు.
పాక్-అఫ్ఘనిస్తాన్ మద్య ఈ సమస్య దాదాపు రెండు మూడేళ్ళ క్రితమే మొదలైంది. కానీ పాకిస్తాన్తో భారత్ గత 30-40 ఏళ్ళుగా వేగుతూనే ఉంది. అయినప్పటికీ భారత్ ఏనాడూ పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకోలేదు. కానీ వీలుచిక్కినప్పుడల్లా పాకిస్తానే భారత్తో యుద్ధానికి కాలు దువ్వింది. ఎదురుదెబ్బలు తింటోంది.
కానీ పాక్ ప్రభుత్వం కేవలం రెండు మూడేళ్ళలోనే తాలిబాన్ల ఆగడాలను భరించలేక సహనం కోల్పోయింది. ఇంతకాలం భారత్కు పక్కలో బల్లెంలా ఉన్నప్పుడు పాకిస్తాన్కి అది తప్పుగా అనిపించలేదు. కానీ అఫ్ఘనిస్తాన్ తమకు పక్కలో బల్లెంలా మారేసరికి భరించలేక ప్రత్యక్ష యుద్ధానికి సిద్దమంటూ బెదిరిస్తోంది.
తమ వలన ఇంతకాలం భారత్ ఏవిదంగా బాధలు పడిందో పాకిస్తాన్కు ఇప్పటికైనా అర్ధమయ్యే ఉంటుంది. ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దాని విలువే వేరు కదా?







