ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్గా ఎలా ఎన్నికయారు?. వైసీపీకి షాక్ ఇస్తూ, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణుల్లో ఈ విజయం రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ ఒక సంచలనమే. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్గా తనదైన ముద్రవేశారు.*
రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం: పంచుమర్తి అనురాధ కుటుంబానికి రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్ఎస్. ఆదాయపన్నుశాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేసి, పదవీవిరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు జరుగుతుండేవి. అలా ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్లో చదివారు. ఆ తర్వాత ఆయనకు బదిలీ కావడంతో అనురాధ హైస్కూల్, ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేశారు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప. ఆ తర్వాత పంచుమర్తి అనూరాధ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదు.
అతి పిన్న వయసులో అనుకోకుండా మేయర్: పంచుమర్తి అనురాధ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 సంవత్సరంలో విజయవాడ మేయర్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఒక రోజు పేపర్ చదువుతుండగా ఆ వార్త అనురాధను ఆకర్షించింది. దీంతో తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో కార్పొరేటర్, మేయర్లకు విడివిడిగా ఎన్నికలు జరిగేవి. దీంతో టీడీపీ నుంచి మేయర్గా పోటీ చేసేందుకు ఏకంగా 18మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాలకు కేంద్ర బిందువు విజయవాడ. అక్కడి జరిగే చిన్న రాజకీయ చర్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా ప్రభావం చూపేదే. పైగా అటు కమ్యూనిస్ట్లకు ఇటు కాంగ్రెస్కు కూడా బలమైన కేడర్ ఉంది. దీంతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన కూడా అడిగిన ప్రశ్నలకు అనురాధ చక్కగా సమాధానం ఇవ్వడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో చంద్రబాబు ఆమెవైపే మొగ్గు చూపారు. నేరుగా జరిగిన మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల నుంచి గట్టి పోటీ ఎదురైనా దాదాపు 6800 పైచిలుకు ఓట్లతో అనురాధ విజయం సాధించారు.
గందరగోళం నుంచి సక్సెస్ఫుల్ మేయర్గా: అనురాధ మేయర్గా ఎన్నికైనా రాజకీయ అనుభవం లేకపోవడంతో తొలినాళ్లలో ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నుంచి తరచూ ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అసలు మొదటి అయిదు నెలలు ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. దీంతో మేయర్ బాధ్యతలు, విధుల గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ట్యూషన్ పెట్టించుకుని మరీ మున్సిపల్ యాక్ట్, నగరానికి, పౌరులకు ఏం చేయాలి? నగరాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ఆ సమయంలో కృష్ణ పుష్కరాలు జరగడంతో రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకునేందుకు ఎంతో దోహపడ్డాయి.
పార్టీ కోసమే: మేయర్ పదవి పూర్తయిన తర్వాత అనురాధ కొన్నాళ్లపాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండిపోయారు. అసలు ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె అనుకోలేదు. అయితే, 2007 నుంచి మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకున్నా, అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. 2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఆ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో కుదరలేదు. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా, దూరం కావడంతో అందుకు ఆసక్తి చూపలేదు. ప్రత్యక్ష రాజకీయాల కన్నా పార్టీకి సేవ చేయాలని సంక్పలించారు. చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు పార్టీ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలా పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీగా కూడా పని చేశారు . ఆ తర్వాత అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.





