జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరుని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. వైసీపి ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు ఈ టికెట్ ఖరారు చేశారు.
ఎన్నికలకు ముందు బాలశౌరి పార్టీ వీడి వెళ్ళిపోవడమే వైసీపికి దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అనుకుంటే, మళ్ళీ మచిలీపట్నంలో ఆయననే ఎదుర్కోవలసి రావడం మరో దురదృష్టమే. వైసీపి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తన పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై పూర్తి పట్టు సాధించారు. కానీ వైసీపి ఎంపీ అభ్యర్ధిగా ఆయనతో పోటీ పడబోతున్న డా.సింహాద్రి చంద్రశేఖర్ రావుకి మచిలీపట్నంపై పెద్దగా పట్టులేదు. కానీ మంత్రి పేర్ని నాని అండగా నిలబడతారనే హామీతో ఆయన అయిష్టంగానే మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు.
కానీ ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేనల ప్రభంజనం ఉందని ముందే పసిగట్టిన పేర్నినాని ఈసారి ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కొడుకు కిట్టూకి ఇప్పించుకున్నారు. కనుక ఆయన దృష్టి అంతా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఆరంగ్రేటం చేస్తున్న కొడుకు మీదే ఉంటుంది తప్ప కొడుకుని పట్టించుకోకుండా సింహాద్రి చంద్రశేఖర్ రావు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవచ్చు.
ఈ నేపధ్యంలో జనసేన అభ్యర్ధిగా మళ్ళీ పోటీ చేయబోతున్న సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇప్పటికే సగం విజయం సాధించిన్నట్లు భావించవచ్చు. మిగిలిన 50 శాతం మే13న పోలింగ్ జరిగినప్పుడు సాధిస్తారు.
మచిలీపట్నం నుంచి శాసనసభకు టిడిపి అభ్యర్ధిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు. పేర్నినాని తన కొడుకు కిట్టూకి ఎంతగా అండగా ఉన్నప్పటికీ, ప్రజలు ఇద్దరు అభ్యర్ధుల రాజకీయ అనుభవం, టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులు వగైరా అన్ని అంశాలను పరిశీలించి కొల్లు రవీంద్రకే ఓట్లు వేసి గెలిపించవచ్చు. కనుక మంచిలీపట్నం ఎంపీ, ఎమ్మెల్యే రెండు సీట్లు కూడా ఈసారి వైసీపి చేజారిపోయిన్నట్లే!




