జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ మధ్య అమెరికాలో కీలక చర్చలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న తానా మహాసభలకు హాజరైన పవన్, రామ్మాధవ్ తాజా రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లోని పరిణామాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఫేస్ కావాలని రామ్మాధవ్ పవన్ కళ్యాణ్ కు ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే దానికి పవన్ కళ్యాణ్ ను సానుకూల స్పందన రాలేదని సమాచారం. అయితే రాష్ట్రానికి విభజన నాటి ప్రమాణాలు పూర్తి చెయ్యడం, ప్రత్యేక హోదాకు సరైన ప్రత్యుమ్న్యాయం చూపించగలిగితే మాత్రం పొత్తుకు తాము సిద్ధమని పవన్ కళ్యాణ్ రామ్మాధవ్ కు చెప్పినట్టు సమాచారం. బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాలలో నాయకత్వ లేమి పట్టి పీడిస్తుంది. పార్టీని నడిపించి ప్రజలను ఆకట్టుకోగల నాయకుడు లేకపోవడం వల్ల నష్టపోతున్నామని కమలనాథుల భావన.
దాని కోసమే వారు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. అయితే గతంలో టీడీపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో బలపడలేదు కాబట్టి జనసేనను విలీనం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇటీవలే ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు వచ్చింది. పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు. దీనితో ఆ పార్టీ మనుగడ కష్టమని దీనితో ఎప్పటికైనా తమ దారికి రావాల్సిందే అని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్ రాజకీయపరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.



