లోకేష్ యువగళం – నవశకం ముగింపు సభలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు చంద్రబాబు – పవన్ కళ్యాణ్. కొద్దికాలంగా రాజకీయ బహిరంగ వేదికలకు దూరంగా ఉంటున్న చంద్రబాబు సభకు హాజరుకావడంతో, దశబ్ద కాలం తరువాత టీడీపీ సభలో పవన్ పాల్గొనడంతో భయంతో ప్రత్యర్థులు, ఆశతో ఇరు పార్టీల క్యాడర్ ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ఈ సభా వేదికలో చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు ఇటు టీడీపీ – జనసేన నేతలకు ఉద్దేజాన్ని, వైసీపీ నేతలకు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఎలా అయినా రెండు పార్టీల పొత్తు నిర్ణయానికి తూట్లు పొడవాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు బాబు – పవన్ ఆ ఛాన్స్ ఇవ్వదలచుకోలేదని ఈ సభ ద్వారా మరోసారి రుజువుచేశారు. తాము తీసుకున్న నిర్ణయానికి ఎలా కట్టుబడతాము అనే దానికి నిదర్శనంగా సభలో ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ పొత్తు ధర్మాన్ని ఇరుపార్టీల క్యాడర్ కు తమ నడవడిక ద్వారా తెలియచేసారు.
సభా ప్రాంగణానికి చేరుకోగానే పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ పలకరించిన తీరు, సభా వేదిక మీద పవన్ పట్ల బాబు చూపిన ఆప్యాయత,లోకేష్ ఇస్తున్న గౌరవం చూస్తుంటే పవన్ చెప్పినట్లు “మన తెలుగుదేశం పార్టీ వెనుక కాదు పక్కన నడుస్తున్నాం” అనే వ్యాఖ్యానానికి ఇరు పార్టీల నేతలు కట్టుబడి ఉన్నారనేది సుస్పష్టం అవుతుంది. టీడీపీ పార్టీ నిర్వహిస్తున్న సభ అయినప్పటికీ పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా తగిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది టీడీపీ.
అలాగే పవన్ కూడా టీడీపీ పార్టీ సంస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుర్పించి టీడీపీ క్యాడర్ ను సంతోష పరిచారు. వైసీపీ ఆశించినట్టు “నువ్వా- నేనా?”అన్నట్లుగా కాకుండా “నువ్వు – నేను”.. అనేలా ఇరు పార్టీల అధినేతలు ప్రవర్తించిన తీరు ఇరు పార్టీల క్యాడర్ కు ఆదర్శంగా నిలిచింది. అలాగే సభా ప్రాంగణం అంతా జై టీడీపీ, జై జనసేన నినాదాలతో మారుమోగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఆనందోత్సహంతో రాజకీయ రణరంగానికి సిద్ధమవుతున్నారు.




