టిడిపి, జనసేనల తొలి జాబితాలో టిడిపి 94 మంది పేర్లతో కూడిన జాబితాని ప్రకటించగా, పవన్ కళ్యాణ్ 21 మందిలో కేవలం ఐదుగురు పేర్లే ప్రకటించారు. పార్టీలో అంతర్గతంగా ఇంకా సీట్ల సర్దుబాట్లు పూర్తి కాలేదని సరిపెట్టుకున్నా, కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించకపోవడంతో వీరాభిమానులు తీవ్ర అసహనంతో రగిలిపోయారు.
అయితే జాబితాలో తమ పేర్లు చూసుకోవాలని ఆరాటపడుతున్న జనసేన అభ్యర్ధులకు కూడా తెలుసు తమ పేర్లు ప్రకటించిన మరుక్షణం నుంచి నియోజకవర్గాలలో వైసీపి అభ్యర్ధి, నేతలు, వారి అనుచరుల నుంచి సమస్యలు మొదలైపోతాయని.
ఎన్నికలలో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఏదో ఓ తప్పుడు కేసు బనాయించినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. వైసీపి కుట్రలు, కుతంత్రాలను అనుభవపూర్వకంగా జనసేనాని పవన్ కళ్యాణ్తో సహా అందరూ తెలుసుకున్నారు కనుక అభ్యర్ధుల పేర్లు ప్రకటించడానికి తొందరపడలేదు.
ఇదెలా ఉందంటే… అర్దరాత్రి ఆడపిల్లని బయటకు పంపించాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందిన్నట్లు ఉంది. ఇలా చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే అని అందరికీ తెలుసు.
చివరికి పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి చెప్పుకోలేకపోయారని అంబటి రాంబాబు వంటివారు అవహేళన చేశారు. కానీ వైసీపి పాలనలో ఇంత అరాచక పరిస్థితులు నెలకొన్నందుకు వారే సిగ్గుతో తలదించుకోవాలి కదా?
అయినా ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల మీదే కాలాకేయ సైన్యం విరుచుకు పడుతున్నప్పుడు జన సైనికులని ఉపేక్షిస్తుందా?కనుక అందరూ ఎవరి జాగ్రత్తలో వారు ఉండటమే మంచిది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెపుతున్నారు.
ఈరోజు మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, “నేను అసమర్ధుడిని కానని మా అన్నయ్య చిరంజీవికి నిరూపించి చూపేందుకే సినీ పరిశ్రమలోకి వచ్చాను. అదేవిదంగా రాష్ట్రంలో మార్పు కోసం రాజకీయాలలోకి వచ్చిన నేను వైసీపి ఆగడాలకు భయపడి పారిపోకుండా ఎదురోడ్డి నిలబడి పోరాడుతూనే ఉన్నాను.
నేను 2014లో పార్టీ ప్రారంభించినప్పుడు నా వెంట కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. నేడు 6.50 లక్షల మంది కార్యకర్తలు నా వెంట ఉన్నారు. కనుక మమ్మల్ని తొక్కేద్దామని వైసీపిలో ఎవరైనా అనుకుంటే వాళ్ళని మేమే తొక్కుకుంటూ ముందుకు సాగిపోతాము.
అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోయి నాపై దాడులకు పాల్పడితే ఏమి జరుగుతుందో మీ ఊహాకే వదిలేస్తున్నాను.
రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా అప్పులు చేసుకుపోతే శ్రీలంక పరిస్థితి ఏమైందో ఏపీలో కూడా అదే జరుగుతుంది. శ్రీలంక అధ్యక్షుడు అధికార నివాసాన్ని ఓ సాధారణ ఆటో రిక్షా డ్రైవర్లు, కూలిపనులు చేసుకుని బ్రతికే మహిళలు ఏవిదంగా వాడుకున్నారో అందరూ చూశారు. ప్రజలు తిరగబడితే ఇక్కడా అదే జరుగుతుంది. కనుక అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హద్దుల్లో ఉంటే అందరికీ మంచిది,” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
“నేను పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నాను. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు,” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ మాటలు రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను అద్దం పడుతున్నాయి కదా? తనపై కూడా వైసీపి మూకలు దాడులకు తెగబడవచ్చిని పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
వైసీపి పాలనలో ఇటువంటి అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నందునే ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోకుండా కట్టడి చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకే చంద్రబాబు నాయుడు కేంద్రం సహాయ సహకారాలు ఆశిస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారని అందరికీ తెలుసు.
ఇందుకు కూడా వైసీపి నేతలు ఏమాత్రం సిగ్గుపడకుండా, తిరిగి ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్నారంటూ నిసిగ్గుగా ఎద్దేవా చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.




