జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరిగింది. చివరి నిముషంలో భీమవరం తెర మీదకు వచ్చింది. ఈ రెండు స్థానాలలోనూ గత ఎన్నికలలో టీడీపీనే గెలిచింది. సిట్టింగు అభ్యర్థులు – పల్లా శ్రీనివాసరావు (గాజువాక), అంజిబాబు (భీమవరం) మరోసారి ఈ ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్నారు.
మరి పవన్ కళ్యాణ్ ధాటికి తట్టుకోగలరో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ ఆశలన్నీ ఈ సారి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మీదే. అందుకే ఈ స్థానాలు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యడం వల్ల ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాల జనసేన అభ్యర్థులకు కూడా మేలు చేస్తుందని జనసేన అభిప్రాయం. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు.
గతంలో చిరంజీవి రెండు చోట్ల నుండి పోటీ చేసినప్పుడు… పాలకొల్లు లో అది వ్యతిరేకంగా పని చేసింది. రెండు చోట్లా గెలిస్తే ఒక చోట రాజీనామా చెయ్యడం ఖాయం కాబట్టి పాలకొల్లు రాజీనామా చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. దీనితో పాలకొల్లులో ప్రజలు ఆయనను ఓడించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటనేది చూడాలి. ఈ ఎన్నికల వరకు గౌరవప్రదమైన సీట్లను సాధించి అవకాశం వస్తే కింగ్ మేకర్ గా అవతరించాలనే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది మొదటి నుండి జనసేన గ్రాఫ్ కొద్దిగా తగ్గడం గమనార్హం.



