
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలోని కొన్ని పార్లమెంట్ స్థానాలలో గత ఎన్నికల సమయంలో పోటీ చేసింది. అయితే ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ కనీసం ప్రచారానికి కూడా వెళ్ళకపోవడంతో పార్టీకి తెలంగాణ రాజకీయాల పట్ల సరైన ఇంట్రెస్ట్ లేదు అనే వాదన ప్రజల్లోకి వెళ్లి అభ్యర్థులకు ఓట్లు పడలేదు.
అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో సారి తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారట. నవంబర్ లేక డిసెంబర్ లో జరగబోయే జీహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనివల్ల బీజేపీకి కూడా ఎంతో కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.
కరోనా నేపథ్యం… అలాగే హైదరాబాద్ లో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కారణంగా అధికార పార్టీ ఇక్కడ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానిని క్యాష్ చేసుకునే స్థితిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకపోవడంతో బీజేపీ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తుంది.
ఇందులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు ఇస్తే… మిగతా చోట్ల ఆ పార్టీ బలం తమకు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ప్రచారం కూడా చేయించాలని వారు అనుకుంటున్నారు. ఈ నెలలోనే పొత్తు, సీట్ల పంపిణీ వంటి వాటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.



