ఇప్పటివరకు తనపై వెల్లువెత్తిన విమర్శలకు పలు మీడియా ఇంటర్వ్యూల ద్వారా ఒక స్పష్టత ఇచ్చిన పవన్ కళ్యాణ్ అడుగులు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో రాజకీయ రంగం వైపుకు పడతాయని తెలపడంతో పవన్ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికారం కంటే కూడా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా ఎదగడమే తన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
2004 ఎన్నికల సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, 2014 ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు అవలంభించిన ‘పాదయాత్ర’ను పవన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగించే యోచనలో ఉన్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. సినిమాల షెడ్యూల్స్ సహకరిస్తే పాదయాత్ర లేదంటే కనీసం బస్సు యాత్ర అయినా చేయాలని పవన్ భావిస్తున్నారట. దీని ద్వారా ఎక్కడికక్కడ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఏర్పాటు చేయడంతో పాటు, స్థానిక సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకునే సౌలభ్యం కలుగుతుందని పవన్ ఆలోచనలు చేస్తున్నారట.
నిజానికి పలు మీడియా ఇంటర్వ్యూలలో ఈ అంశాలను పరోక్షంగా పేర్కొన్నప్పటికీ ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేదు. అయితే పవన్ వెనకున్న శిభిరం మాత్రం ఇందు నిమిత్తం భారీ కసరత్తులే చేస్తోందని తెలుస్తోంది. ‘జనసేన’ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సాగనున్న ఈ యాత్రలతో వచ్చే ఎన్నికల నాటికి ‘జనసేన’ను ఏపీలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే పనిగా పెట్టుకున్నారట. మరో విశేషమేమిటంటే… 2019 ఎన్నికలలో ఎలాంటి పొత్తులకు అవకాశం లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పక్కాగా కార్యాచరణ రూపొందించుకున్నారని మరో టాక్. సదరు సంగతులన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీసాయి.





