నేడు తూర్పు గోదావరి జిల్లాలో అమరజీవి జలధార పధకానికి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజకీయ నాయకులకు ప్రశ్నించే ధైర్యం లేకపోవడం గురించి మాట్లాడుతూ రాష్ట్రవిభజన గురించి మాట్లాడిన మాటలు చాలా ఆలోచింపజేస్తాయి. కానీ అవే మాటలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంలా అందించినట్లయ్యింది.
“నాడు బలవంతంగా రాష్ట్ర విభజన చేస్తుంటే వద్దంటూ ఉద్యమాలు చేశారే తప్ప విభజిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతుందో ఎవరూ గట్టిగా మాట్లాడలేదు. ఎందుకంటే హైదరాబాద్లో తమ ఆస్తులు, వ్యాపారాలు పోతాయని భయపడి!
పొట్టి శ్రీరాములు 56 రోజులు కడుపు మాడ్చుకొని ప్రాణత్యాగం చేసి సాధించిన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తారా? నాయకులు చేసిన తప్పులు, పొరపాట్లకు రాష్ట్రాన్ని, ప్రజలను విడదీస్తారా? ధైర్యం లేని నాయకులు, ధైర్యం లేని సమాజం ఏం సాధించగలరు?” అంటూ రాష్ట్ర విభజనపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మరోసారి సభాముఖంగా బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ ఏదో నోరుజారి కోనసీమకి దిష్టి అంటేనే తెలంగాణ నాయకులు ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఇప్పుడు సభాముఖంగా రాష్ట్ర విభజన సరికాదని పవన్ కళ్యాణ్ చెపితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెలరేగిపోకుండా ఉంటారా?
కానీ ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజనతో ఆంధ్రా నష్టపోయినా కనీసం తెలంగాణ ప్రజలకు మేలు కలిగితే అందరికీ సంతోషమే. కానీ “బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, నవీన్ రావు ఇంట్లో బంగారం నింపుకోవడమా? బంగారు తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు వందలు వేల ఎకరాలు, వేలకోట్లు ఆస్తులు పోగేసుకోవడమా?” అని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రతీరోజూ అడుగుతూనే ఉన్నారు కదా?
కనుక రాష్ట్ర విభజనతో ఆంధ్రా మాత్రమే నష్టపోయిందనుకోలేము. విభజనతో ఆంధ్రా ఓ విధంగా నష్టపోతే తెలంగాణ మరో విధంగా నష్టపోయింది అంతే తేడా!




