5 కోట్ల విరాళంతో జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆర్థిక సాయం గురించి మొదటిసారిగా తెనాలి బహిరంగసభలో ప్రస్తావించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కౌలు రైతు కుటుంబాలకు జనసేన చేసిన ఆర్థిక సాయం తనను కదిలించిందని, ఈ పోరాటం ఆగకూడదు అనే ఉద్దేశంతో తనవంతు బాధ్యతగా చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ప్రకటించారంటూ చెప్పుకొచ్చారు.
అధికారం లేకపోయినా సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని రైతు కుటుంబాల కోసం సాయంగా అందించడం, ప్రజల కోసం బలంగా నిలబడడం పై చిరంజీవి తన పై ప్రసశంసలు కురిపించారని, తానూ సాయం చేయడమే కాకుండా తన కుమారుడు రామ్ చరణ్ కు కూడా జనసేనకు సాయం చెయ్యమని చెప్పారు అంటూ వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాణను తెనాలి సభలో పంచుకున్నారు పవన్.
తోటి కుటుంబసభ్యుడిలా కాకుండా సమాజనికి మంచి చేసే వ్యక్తిగా భావించి నువ్వు కూడా పవన్ కు విరాళం ఇవ్వాలంటూ రామ్ చరణ్ కు చిరు చెప్పారంటూ సభా వేదిక ద్వారా మెగా కుటుంబం మొత్తం తనకు అండగా ఉందనే అభిప్రాయాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు పవన్. దీనితో జనసేనకు అన్న ఆశీర్వాదం తో పాటు మెగా ఫాన్స్ ఆశీస్సులు కూడా సంపాదించుకుంటున్నారు పవన్.
ఒంటరిగా 2019 ఎన్నికల బరిలో దిగిన పవన్, జనసేనలకు ఓటమి అవమానం బరువు తెలియడంతో ఈసారి అందరిని కలుపుకుంటూ, తనకు అండగా తన కుటుంబం కూడా నిలబడింది అనేది భావనను ప్రజలలోకి తీసుకువెళుతూ గెలుపు గర్వాన్ని అందిపుచ్చుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు పవన్. అలాగే తానూ పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ నేత వర్మను కలుపుకుని, టీడీపీ – జనసేన పార్టీల క్యాడర్లను సమన్వయ పరుచుకుంటూ వైసీపీ వ్యూహాలను తిప్పికొడుతున్నారు.




