ప్రస్తుతం వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉంటున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, వరుసగా సినిమాలను ఒప్పుకుంటుండడంతో ఒక విధంగా సినీ అభిమానులు ఆనందపడుతున్నా, రాజకీయాల్లో పవన్ ను ఒక ఉన్నత స్థానాల్లో చూడాలనుకుంటున్న వారిని మాత్రం నిరుత్సాహ పరుస్తోంది. అయితే, పవన్ తన పొలిటికల్ ప్రచారానికి ‘బుల్లితెర’ను ఒక వేదికగా ఎంచుకోబోతున్నారని సోషల్ మీడియా సందడి చేస్తున్న అంశం.
బాలీవుడ్ లో “సత్యమేవ జయతే” వంటి ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజానీకానికి దగ్గరైన అమీర్ ఖాన్ బాటలోనే పవన్ అనుసరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రం పూర్తి కాగానే “సత్యమేవ జయతే”ను తెలుగులో రూపొందించడానికి పవన్ నిమగ్నమవనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ఛానల్ ‘ఈ టీవీ’ ఛానల్ ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను తీసుకుందని టాక్.
ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోలలో సామాజిక అంశాలపై పుష్కలమైన జ్ఞానం, సమాచారం ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ ఒక్కరే కావడంతో “సత్యమేవ జయతే”కు పవన్ ఒక్కడే అర్హుడని, అందుకే సదరు ఛానల్ పవన్ ను ఎంపిక చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయో గానీ, ‘జనసేన’ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాత్రం ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజంగా అదే జరిగితే మరో సంచలనానికి పవన్ తెర లేపినట్లే కదా..!





