ప్రజల నాడి పట్టుకున్న నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు… తన నాడితోనే ప్రజలను శాసించాలనుకున్న నేత ప్రతిపక్ష నేత అవుతాడు… అని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. బహుశా ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయని చెప్పాలి. ‘అభివృద్ధి’ చేయడమే ప్రజలకు కావాల్సింది అని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తుంటే… తనకు తోచిన విధానమే సరైన మార్గమని ప్రజలను బలవంతంగా అయినా నమ్మించే ప్రక్రియలో ప్రతిపక్ష నేత జగన్ అడుగులు పడుతున్నాయని విశ్లేషకుల మాట.
గత రెండేళ్ళ నుండి ప్రతిపక్ష నేతగా ఒక్క విషయంలో కూడా జగన్ ప్రజల పక్షాన నిలబడకపోవడం కొసమెరుపు. అధికార పక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా ధర్నాలు, దీక్షలు చేపట్టారు తప్ప, వాటికి ప్రజల నుండి ఎంతవరకు ఆమోదం పొందిందన్న ఆలోచన జగన్ లో కరువైందని ప్రతిసారి ప్రజలు నిరూపిస్తూనే వచ్చారు. అయినప్పటికీ జగన్ లో మార్పు రాకపోవడం గమనించాల్సిన విషయం. నిజంగా తానూ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని కాను, ప్రజలలో ఒక వ్యక్తిని అని తనను తానూ విశ్లేషించుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికి కష్టసాధ్యంగా, ఆచరణకు సాధ్యం కాని విషయమైనప్పటికీ…
పరిపాలన చేపట్టిన మూడు నెలల్లోనే కరెంటు సరఫరాను గాడిలో పెట్టినందుకు… హుదుద్ కు అల్లకల్లోలమైన విశాఖను ఒక్క నెల రోజుల్లోనే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకువచ్చినందుకు… నూతన రాజధాని కోసం చేపట్టిన ప్రణాళికలు… పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు… నదీ జలాల అనుసంధానంలో భాగంగా పోలవరం పూర్తయ్యే లోపు పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం… వంటి ప్రధాన విషయాలలో అధికార పక్ష చర్యలను ఎలా అభినందించవచ్చో… పూర్తిగా రుణమాఫీ చేయలేనందుకు.., రెవిన్యూ శాఖపై స్వయంగా ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణలు చేసిన వైనంపై… కేంద్రం నుండి ఆశించిన మేరకు నిధులను తీసుకు రాకపోవడంపై… విమర్శలను చేయవచ్చు.
అలా కాకుండా ఎల్లకాలం చంద్రబాబు సర్కార్ పై మండిపడుతూ తన మాటలకు తానే విలువ లేకుండా చేసుకుంటున్నాడని, ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విషయాలను విభేదిస్తూ ప్రజా ఆలోచనలకు దూరంగా జరుగుతున్నారని… అసలు నిజంగా జగన్ అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వచ్చినట్లయితే… కాలక్రమేణా ప్రభుత్వాన్ని ఎండగట్టే అరుదైన అవకాశం కూడా ఒక్క జగన్ కే దక్కి ఉండేదని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అభినందనలు తెలిపిన సమయంలో సంతోషించిన అధికార పక్షం… నేడు అందులో బొక్కలు చూపిస్తుంటే మాత్రం మండిపడుతోందన్న వాదనతో ప్రజలను ఆకర్షించే అరుదైన అవకాశం కూడా ఒక్క జగన్ కే సొంతమయ్యేది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కాకుండా అవకాశవాదంగా రాజకీయాలు చేయడం వలన మరియు ముందుచూపుతో కాకుండా అప్పటికప్పుడు రాజకీయ లభ్ది పొందేందుకు మాత్రమే ఆసక్తి చూపించడం వలన జగన్ గ్రాఫ్ రోజు రోజుకి దిగజారుతోందని వెలువడుతున్న విశ్లేషణలు కోకొల్లలు.
అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు… మరో మూడేళ్ళ పాటు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ మూడేళ్ళ సమయాన్ని అయినా జగన్ సరిగా వినియోగించుకుంటే… ప్రజల మద్దతు పొందిన వారవుతారని, అధికార పక్షాన్ని విమర్శించడం కోసం లేనిపోని అసత్య ప్రకటనలు చేసే కంటే… నిజాలను నిర్భయంగా ఒప్పుకుని ముందుకు సాగితే జగన్ అనుకున్న లక్ష్యానికి ఏదొకనాడు చేరువ కావచ్చు. అలా కాదు, నేను మారను… నా వైఖరి ఇంతే… అని ప్రవర్తిస్తే దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి రావచ్చు అన్నది అసలు మాట. మరి ఈ మూడేళ్ళ కాలంలో అయినా జగన్ నుండి ఒక్క “నిజమైన” ప్రకటన ఆశించవచ్చా..?



