అమరావతి, అభివృద్ధిపై నిలదీయాల్సి ఉండగా….

TDP-YCP-Janasena

ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికలకు సర్వ సన్నాహాలు చేసుకొని ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. అన్ని పార్టీలు తాము చెప్పదలచుకొన్న విషయాలు ప్రజలకు చెప్పేశాయి. కనుక కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కనుకనే పరస్పర విమర్శలు, ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాయని భావించవచ్చు. అంటే ప్రతిపక్షాలు అప్రయత్నంగానే వైసీపి ఎప్పటికప్పుడు ఇస్తున్న ఎన్నికల అజెండాని తమకు తెలియకుండానే ఫాలో అయిపోతున్నాయని చెప్పవచ్చు.

ఈ ఎన్నికలలో ప్రధాన అజెండాగా ఉండాల్సిన అంశాలు: రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, రాజధాని, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ తదితర అంశాలు. వీటిపై ప్రతిపక్షాలు జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తూ ప్రజలను కూడా ఆ దిశలో ఆలోచింపజేయాల్సిన ఉండగా ‘రాయి దాడి’ ఎపిసోడ్‌లో కొట్టుకుపోతున్నాయి.

ADVERTISEMENT

టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో రాష్ట్రానికి సంబందించిన ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ, జగన్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రజలు కూడా ఆ దిశలో ఆలోచించేలా చేయగలిగారు. కానీ కీలకమైన ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు వాటి గురించి మాట్లాడకుండా చేసేందుకు వైసీపి ఎప్పటికప్పుడు ఈవిదంగా ఏదో హడావుడి చేస్తూ ఎన్నికల అజెండాని నిర్దేశిస్తుంటే, ప్రతిపక్షాలు దాని మాయలో పడి కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తున్నాయి.

వాటి హడావుడిలో అవి ఉండగానే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. మరో 48 గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన, అప్పటి నుంచి ఈ నెల 25వరకు నామినేషన్స్‌ దాఖలు ప్రక్రియ మొదలవబోతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో మరో కొత్త రకం హడావుడి మొదలవుతుంది.

ఆ తర్వాత రెండు వారాలలోనే అంటే మే 13న పోలింగ్‌ జరుగుతుంది. కనుక ఏపీలో నాలుగు పార్టీలు ఓటర్లను మెప్పించి తమ వైపు తిప్పుకునేందుకే ఏమి చేయాలనుకున్నా రెండు వారాల సమయమే వాటికి మిగిలి ఉంది.

కనుక ఇప్పటికైనా ప్రతిపక్షాలు వైసీపి ఉచ్చులో నుంచి బయటపడి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై చర్చ జరిగేలా చేయడం చాలా అవసరం. లేకుంటే ఆ తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories