రాజకీయాలకు కేంద్ర బిందువుగా కృష్ణాజిల్లాకు ఉన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే జిల్లాకు లేదు. అందులోనూ ముఖ్యంగా విజయవాడ నగరం వేదికగా ‘రాజకీయం’ వివిధ రూపాలు సంతరించుకుంటుంది. ఒకప్పుడు బెజవాడను ఏలిన హత్యా రాజకీయాలు నగర అభివృద్ధికి ఆటంకం కలిగించాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. వంగవీటి మోహన రంగ హత్య విజయవాడ నగర పురోగతిని దాదాపు 25 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్లిందని పలువురు ఔత్సాహికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం కొత్త రూపు సిద్ధించుకుంటున్న తరుణంలో… మరోసారి బెజవాడ రాజకీయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ‘కల్తీ మద్యం’ ఘటనతో మల్లాది విష్ణు పేరు తెర పైకి రావడంతో వేడెక్కిన రాజకీయాల్లోకి… ఒక్కసారిగా వచ్చిన ‘కాల్ మనీ’ కేసు రచ్చ రచ్చ చేస్తోంది. వారు, వీరన్న తేడా లేకుండా అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు ఈ ‘కాల్ మనీ’ కేసులో ఇరుక్కుని ఉన్నారన్న వార్తలు రాజకీయాల్లో ఓ విధమైన స్తబ్దతను సృష్టించింది.
అందుకే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై ఆచితూచి మాట్లాడుతున్నాయి. ప్రధాన నిందితులు అరెస్ట్ కావడం మరియు మరికొందరు స్వచ్చందంగా లొంగిపోతారనే సమాచారంతో ఎప్పుడు, ఎవరి పేరు బయటకు వస్తుందోనన్న ఆందోళన అన్ని పార్టీల నేతల్లోనూ కలుగుతోంది. మరో విశేషమేమిటంటే, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ ‘కాల్ మనీ’ వ్యాపారాన్ని నియంత్రించాలని, దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ, ఇప్పటి నుండి ప్రజలెవ్వరూ డబ్బులు తిరిగి కట్టవద్దని ప్రకటనలు చేస్తున్నారు.
అయితే జరుగుతున్న పరిణామాలు మరోసారి బెజవాడ అభివృద్ధిని అడ్డుకునేలా కనపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. అందుకు తగిన విధంగా తాత్కాలిక రాజధాని ప్రకటనతో పాటు స్వయంగా చంద్రబాబు విజయవాడ నగరంలో కొలువు తీరడంతో, ఇక బెజవాడ అభివృద్ధి ఆకాశమే హద్దుగా సాగుతుందని భావించారు. దుర్గ గుడి ఫ్లై ఓవర్, మెట్రో ప్రాజెక్ట్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విజయవాడ నగర రూపురేఖలు మారుస్తాయని అంచనా వేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ లకు వచ్చిన ఇబ్బందులేమీ లేవు గానీ, నగరంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పెట్టుబడులకు సానుకూలం కాదన్న సంకేతాలు ఇస్తుందని, రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.





