గత ఎన్నికలలో వైసీపిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్. ఆయనే ఈసారి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవడం చాలా కష్టమని తేల్చి చెప్పేశారు. అందుకు బలమైన కారణం, ఉదాహరణ కూడా చెప్పారు.
ఆయన పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వూలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి అడిగినప్పుడు, “ఈసారి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అర్దం చేసుకోకుండా అందరికీ తాయిలాలు పంచడానికే ప్రాధాన్యం ఇస్తూ 5 ఏళ్ళు గడిపేశారు.
గతంలో ఛత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా అచ్చం ఇలాగే రాష్ట్రాభివృద్ధి చేయకుండా, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర అవసరాలు గుర్తించకుండా నియోజకవర్గాలవారీగా తాయిలాలు పంచుతూ కాలక్షేపం చేసి ఎన్నికలలో ఓడిపోయారు.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 ఏళ్లుగా అలాగే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టవలసి ఉండగా సంక్షేమ పధకాల పేరుతో తాయిలాలు పంచుతూ ప్రజలను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించారు.
పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేసే బదులు వారికి పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతూ మేలు చేస్తున్నానని, కనుక ప్రజలు తనకు ఋణపడి ఉండాలని తనకే మళ్ళీ ఓట్లు వేస్తారనే భ్రమలో ఉండిపోయారు. ఇదే వైసీపి కొంప ముంచబోతోంది,” అని కుండబద్దలు కొట్టారు.
నిజానికి ప్రశాంత్ కిషోర్ చెపుతున్న ఈ విషయం రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ కూడా తెలుసు. బహుశః వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి సమయం లేదు. ప్రజలు ఇచ్చిన పుణ్యకాలం ముగిసిపోతోంది. కనుక ఇటు నుంచి వీలుకాకపోతే అటు నుంచి అన్నట్లు రెండో ఛాన్స్ కోసం చొక్కా మడత పెడదామని చెపుతున్నారు. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ మడత పెట్టనిచ్చేలా లేదు. కనుక ప్రశాంత్ కిషోర్ చెప్పిన్నట్లు ఈసారి కష్టమే!




