అవును మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ యూపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అయన వైసీపీలో ఎప్పుడు పని చేశారు? అనే సందేహం కలుగవచ్చు.
జగన్ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ నేతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు. కర్ణుడు చావుకి వంద శాపాలన్నట్లు, వైసీపీ ఓటమికి అనేక కారణాలలో ప్రవీణ్ ప్రకాష్ దురుసు వైఖరి కూడా ఓ కారణమని అందరికీ తెలుసు.
అయితే అయన చాలా ఆలస్యంగా ఈ విషయం గ్రహించారు. అందుకే ప్రభుత్వం మారిన తర్వాత, తన తీరు పట్ల ఎవరైనా నొచ్చుకుంటే అందరికీ క్షమాపణలు అని చెప్పుకున్నారు కూడా.
వైసీపీ హయంలో తన అత్యుత్సాహం ప్రదర్శించినందుకు తనపై చర్యలు తప్పవని భావించిన ప్రవీణ్ ప్రకాష్ ఇంచుమించు ఏడు సంవత్సరాలు సర్వీసు మిగిలి ఉండగానే వీఆర్ఎస్ తీసుకోవడం అయనలో అపరాధభావానికి మరో నిదర్శనం. దానిని కూటమి ప్రభుత్వం వెంటనే ఆమోదించి రిలీవ్ చేసింది. అప్పుడు గానీ తాను తొందరపడ్డానని అయనకు అర్థం కాలేదు.
మళ్ళీ సర్వీసులో తీసుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ ఫలించలేదు. కనుక తన స్వ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయారు. ఎలాగూ వైసీపీ రాజకీయాలతో రాటుతేలారు కనుక యూపీ కాంగ్రెస్ పార్టీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కనుక భవిష్యత్లో ఏదో ఓ రోజు కాంగ్రెస్ నాయకుడుగా ఆంధ్రాలో పర్యటించినా ఆశ్చర్యం లేదు.





