అధికార పార్టీలకు స్వామి భక్తి ప్రదర్శించే అధికారులకు ఆంధ్రప్రదేశ్లో కొదవ లేదు. ఏ అధికారి అయినా ప్రభుత్వానికి లోబడి పని చేయాలి కానీ లోబడిపోకూడదు. అలా లోబడిపోయి అడ్డమైన పనులు చేస్తే ఏమవుతుందో తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ అవుతున్న పోలీస్ ఉన్నతాధికారులను చూస్తే అర్దమవుతుంది.
ఏపీలో ప్రభుత్వం మారితే అలాగే జరుగుతుందని నారా లోకేష్ ఎర్ర డైరీ చూపించి చెపుతున్నా కొంత మంది అధికారులు అటువంటి భయాలేవీ పెట్టుకోకుండా స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మొదటి నుంచి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తమని చాలా ఇబ్బంది పెడుతూన్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఓ పక్క జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యా బోధన విషయంలో చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ తమతో ఆడుకుంటుంటే, ప్రవీణ్ ప్రకాష్ మరో విదంగా తమని ఇబ్బంది పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయినప్పటికీ ప్రభుత్వం తీరు మారలేదు… ఆయన తీరు కూడా మారలేదు. ఏప్రిల్ 2న ఆన్లైన్లో జిల్లా స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు భోధన, భోధనేతర సిబ్బందితో సమావేశమవుతానని, దానికి అందరూ విధిగా హాజరుకావలని హుకుం జారీ చేశారు.
ఈ సమావేశంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్దులకు సంబందించి వివిద అంశాలను సమీక్షిస్తానని చెపుతున్నారు. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు, త్వరలో ఎన్నికల విధులకు హాజరు కాబోతున్న ఉపాధ్యాయులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వంకతో సమావేశాలు నిర్వహించవచ్చా లేదా అనేది ఎన్నికల సంఘం చెప్పాలి.
ఒకవేళ వచ్చనుకుంటే, మునిసిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య, పంచాయితీరాజ్ తదితర శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తారా?
ఈ సమావేశాన్ని ప్రవీణ్ ప్రకాష్ సమర్ధించుకున్నప్పటికీ, సరిగ్గా ఎన్నికలకు 20 రోజుల ముందు అంటే ఏప్రిల్ 23న ఆయన విద్యార్దుల తల్లితండ్రులతో కూడా సమావేశం కాబోతున్నారు! ఆరోజు తల్లితండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలని, దానిలో తాను కూడా ఆన్లైన్లో పాల్గొని తల్లితండ్రులతో నేరుగా మాట్లాడుతానని ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు. అంటే తల్లితండ్రులకు కూడా ఆయన బ్రెయిన్ వాష్ చేయాలని అనుకుంటున్నారా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.




