ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల చేసిన అసందర్భ వ్యాఖ్యలతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మద్య ఎంత రగడ జరిగిందో అందరూ చూశారు.
సాధారణంగా ఆయన రాజకీయ విశ్లేషణలు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. కానీ తనపై పడిన ఈ వైసీపీ ముద్ర తొలగించుకోవాలనుకున్నారో ఏమో అమరావతి విషయంలో జగన్ వైఖరిని తప్పు పట్టారు.
శనివారం 99 టీవీ న్యూస్ ఛానల్లో మావిగన్-అమరావతి గురించి మాట్లాడుతూ, “అమరావతికి నేను వ్యతిరేకం కాదని జగన్ చెప్పుకున్నారు. కానీ అమరావతిని కోరుకున్నవాళ్ళు చంద్రబాబు నాయుడుకి, మావిగన్ కోరుకున్నవాళ్ళు నాకు ఓట్లు వేయాలని అన్నారు.
జగన్ అమరావతికి వ్యతిరేకం కాకపోతే మావిగన్ ఎందుకంటున్నారు?ఆ పేరుతో తనకు ఓట్లు వేయాలని ఎందుకు అడుగుతున్నారు?
ఏపీ రాజధాని విషయంలో జగన్కి స్పష్టత లేకపోవడం వలననే ఒకసారి మూడు రాజధానులు, మరోసారి విశాఖ, ఇప్పుడు మావిగన్, మళ్ళీ వెంటనే విజయవాడ రాజధాని అంటున్నారనిపిస్తోంది. ఆయన అయోమయంలో ఉండటమే కాకుండా పార్టీ శ్రేణులను, ప్రజలను కూడా ఈ ప్రతిపాదనలతో గందరగోళ పరుస్తున్నారు.
అందుకే ప్రజలు తనని తిరస్కరించారని, ప్రజలు రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డికి కూడా అర్ధమైంది. కానీ ఈ విషయం ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందువల్లనంటే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత వల్లనే. కనుక ఈ ప్రతిపాదనలు, వాదనలు అన్నీ కూడా జగన్ ఇగో వలన ఏర్పడుతున్నవే తప్ప మరొకటి కాదు,” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.






