డొంక తిరుగుడు లేదు! రంగాను చంపింది నెహ్రూనే!

 vangaveeti radha devineni nehruవిజయవాడ వేదికగా జరుగుతున్న ‘వంగవీటి వర్సెస్ దేవినేని’ ఎపిసోడ్ లో మరోసారి వంగవీటి రాధ మాటలు సంచలనంగా మారాయి. దేవినేని నెహ్రూతో జరిపిన ఏ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ వలన ఈ వేడి రాజుకుందో, అదే మీడియా ఛానల్ మరోసారి వంగవీటి రాధ తలుపు తట్టింది. ఆదివారం నాడు ప్రసారమైన ఈ ఇంటర్వ్యూలో రాధ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రకంపనలను సృష్టించడం ఖాయంగా కనపడుతోంది.

“డొంక తిరుగుడు మాటలొద్దు, రంగాను చంపింది దేవినేని నెహ్రూనే. ఈ హత్యలో నెహ్రూతో పాటు భాగస్వామ్యులైన మరికొందరు ప్రస్తుతం రోడ్ల మీద దర్జాగా తిరుగుతున్నారు. అలాగే ఇందులో కీలక భూమిక పోషించిన మరికొందరు నేతలు ప్రస్తుతం సమాజంలో ఉన్నత హోదాలలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని రోడ్డు మీదకు లాగడం ఇష్టం లేకనే పేర్లు చెప్పడం లేదని, వారి పాపాన వారే పోతారని, అయితే ఈ ఉదంతంలో నమ్మిన వారు కూడా మోసం చేసిన మాట వాస్తవమేనని, కొంత మంది అమ్ముడుపోయారు, మరికొంతమంది లాలూచీ పడ్డారు. అయితే సీబీఐ అయినా తమకు న్యాయం చేస్తుందని నమ్మితే, అక్కడ కూడా తమకు అన్యాయమే ఎదురు కావడంతో, చట్టంపై ఉన్న నమ్మకం పోయిందని” స్పష్టమైన వ్యాఖ్యలతో పౌరుష పదజాలంతో రాధ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ADVERTISEMENT

“చేతకానివాడిగా చిత్రీకరిస్తున్న వారందరికి కూడా ఒక విధమైన వార్నింగ్ ఇస్తున్నానని, తానూ మౌనంగా ఉంటోంది, చేతకాక కాదని, కానీ తానూ సంయమనం కోల్పోయి ఒక మాట అంటే, దానికి జరగబోయే నష్టం తనకు తెలుసు కాబట్టే, ఎవరెన్ని కూతలు కూసినా మౌనంగా ఉంటున్నానని, ఒకప్పుడు రగిలిన ‘కమ్మ – కాపు’ విద్వేషాలు మళ్ళీ పునరావృతం కాకూడదని భావిస్తున్నాను. ఇదే సమయంలో మరొక అంశం కూడా స్పష్టం చేస్తున్నానని, ఎప్పటికీ దేవినేని కుటుంబంతో రాజీపడే ప్రసక్తే లేదని, వారు నాకు శత్రువులేనని” రాధ స్పష్టం చేసారు.

‘వంగవీటి’ పేరుతో సినిమా తీస్తున్న వార్తలపై స్పందించిన రాధ… “మా ఇంటి పేరుతో ఇష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తే తానూ భరించినా, రంగా అభిమానులు సహించే స్థాయిలో లేరని, అప్పుడు ఏర్పడబోయే పరిణామాలకు తానూ బాధ్యుడని కాదని, అయితే వాస్తవాలు చూపిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవని, కానీ దీని గురించి వర్మ ఇప్పటివరకు తనను గానీ, తన కుటుంబ సభ్యులను గానీ సంప్రదించలేదని” కాస్త కటువుగానే సమాధానం చెప్పారు.

దేవినేని కుటుంబ విషయాలు ప్రస్తావించినపుడు, ఒకటి రెండు సార్లు అసభ్య పదజాలంతో స్పందించిన రాధ, ఇంతకంటే దారుణమైన మాటలు తామూ, తమ స్నేహితులము కూర్చుని ఉన్న సందర్భాలలో మాట్లాడుకుంటామని, కావాలంటే ఆ సమయంలో మీరు కూడా వచ్చి తమ మాటలను రికార్డు చేసుకోవచ్చని సదరు మీడియా ఛానల్ కు ఓ ‘ఆఫర్’కు కూడా ప్రకటించారు వంగవీటి రాధ. మరి రాధ చేసిన తాజా వ్యాఖ్యలతో దేవినేని వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories