రాజకీయాలు దిగజారితే బాధితులు నాయకులేగా?

Revanth Reddy Faces Criticism Over BRS Leaders' Detention

దేశ, రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అవాంచనీయ పద్దతులు కాలక్రమంగా అధికారిక నిబంధనలుగా మారిపోతున్నాయి. వాటిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలు ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తుండటం, అలాగే ప్రతిపక్ష నేతల కదలికలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం వంటివి కనిపిస్తున్నాయి.

ఇటీవలే హైదరాబాద్‌ నడిబొడ్డున సనత్ నగర్‌ వద్ద ‘డా.మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్‌’ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఏపీలో వైసీపీ మాదిరిగానే అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ కూడా క్రెడిట్ చోరీ పాట పాడుతుంటుంది.

ADVERTISEMENT

ఇలాంటి వాదోపవాదాలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. కానీ మాజీ మంత్రులు, బీఆర్ఎస్‌ సీనియర్ నేతలు హరీష్‌ రావు తదితరులు నేడు టిమ్స్ హాస్పిటల్‌ సందర్శనకు బయలుదేరితే వారిని పోలీసులు గృహ నిర్బంధం చేయడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

నాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో మంత్రులకు వినతి పత్రం అందించేందుకు వస్తే ఆయనని లోనికి రానీయకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతకి సచివాలయంలో ప్రవేశానికి అనుమతించకపోవడాన్ని చాలా మంది తప్పు పట్టారు. కానీ ఇప్పుడు అదే సచివాలయంలో అదే సిఎం చాంబర్‌లో రేవంత్ రెడ్డి, మంత్రులు కూర్చుంటున్నారు కదా?

ఇప్పుడు పోలీసులు బీఆర్ఎస్‌ పార్టీ నేతలను టిమ్స్ హాస్పిటల్‌ సందర్శించకుండా గృహ నిర్బంధాలు చేయడంతో, సిఎం రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయినా బీఆర్ఎస్‌ పార్టీ నేతలని టిమ్స్ హాస్పిటల్‌ సందర్శించకుండా ఎందుకు అడ్డుకుంటున్నట్లు? కానీ వాళ్ళని ఎంతకాలం అడ్డుకోగలరు? అడ్డుకోవడం అవసరమా?

ఇదివరకు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపి, జనసేన నేతలెవరినీ రుషికొండ ప్యాలస్‌ చూసేందుకు అనుమతించలేదు. కానీ ఆ తర్వాత సిఎం, డెప్యూటీ సిఎం హోదాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ వెళ్ళి చూసొచ్చారు కదా?

నాడు పవన్ కళ్యాణ్‌ విశాఖకు వస్తే ఆయనను హోటల్ రూములో నిర్బందించి, బలవంతంగా హైదరాబాద్‌ తిప్పి పంపేసినప్పుడు జగన్‌ ప్రభుత్వమే విమర్శల పాలయింది కదా?

నాడు యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌ని అడ్డుకున్నప్పుడు అయన జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నారా లోకేష్‌ని అడ్డుకుంటే ఆయనకే ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుందని గ్రహించి జగన్‌ ప్రభుత్వం అడ్డుకోవడం మానేసింది.

అదేవిధంగా ఇప్పుడు జగన్‌ పరామర్శల పేరుతో బలప్రదర్శన యాత్రలు చేస్తున్నప్పుడు, వాటిని ప్రభుత్వం అడ్డుకోవడం అవసరమా? అయినా అడ్డుకోలేకపోతున్నారు కదా? అడ్డుకోకుండా ఉంటే ఓవర్ యాక్షన్ చేసి తాము తవ్వుకున్న గోతిలో తామే పడతారు కదా?

ఇప్పటికే రాజకీయాలు చాలా నీచ స్థాయికి దిగజారాయి. వాటిని ఇంకా దిగజార్చుకోవడం అవసరమా? దిగజార్చుకుంటే నష్టపోయేది రాజకీయ నాయకులే కదా?

ADVERTISEMENT
Latest Stories