షర్మిల చక్రం తిప్పడానికి… 25/5 సీట్లు చాలట!

Revanth Reddy Sharmila

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శనివారం తొలిసారిగా ఏపీకి వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ అధ్వర్యంలో విశాఖలో జరిగిన ‘న్యాయ సాధన సభ’లో రేవంత్‌ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేస్తారని అందరూ భావించారు కానీ చాలా ఆచితూచి మాట్లాడుతూ, ఏపీ రాజధాని, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌, ప్రత్యేక హోదా వంటి పెద్దగా ఇబ్బందిలేని సమస్యల గురించి మాత్రమే మాట్లాడారు.

ADVERTISEMENT

అయితే ఏపీకి జరుగుతున్న ఈ అన్యాయాలపై రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ధైర్యంగా కేంద్రంతో పోరాడలేకపోతోందని ఒక్క షర్మిలమ్మ మాత్రమే పోరాడుతున్నారన్నారు.

కనుక ప్రజల కోసం ధైర్యంగా పోరాడుతున్న షర్మిలమ్మ మొహం చూసి ఈసారి ఎన్నికలలో ఏపీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 25 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఇమ్మనమని రేవంత్‌ రెడ్డి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఆ మాత్రం సీట్లు ఇస్తే చాలు ఆమె ప్రాణాలొడ్డి పోరాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకుంటారని రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఆమెకు, ఏపీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పిసిసి అధ్యక్షుడుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా సాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆమె తప్పకుండా ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని రేవంత్‌ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేవన్న రేవంత్‌ రెడ్డి, ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఎంతో విధేయంగా మెసులుకుంటూ, మీరు నాకు పెద్దన్నవంటి వారు తెలంగాణ అభివృద్ధి కోసం నా ప్రభుత్వానికి తోడ్పడాలని సభాముఖంగా వేడుకున్నారు. అక్కడ వేడుకొని, ఇక్కడ ఏపీలో మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని రేవంత్‌ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

అయితే ఈసారి ఎన్నికలలో ఏపీ కాంగ్రెస్ పార్టీయే గెలిచి ఆధికారంలోకి వస్తుందని ప్రగల్భాలు పలాకాకుండా ఏపీ కాంగ్రెస్‌కు 25/5 సీట్లు ఇచ్చి గెలిపిస్తే చాలని చెప్పడం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అడిగిన్నట్లే భావించవచ్చు.

ఈసారి టిడిపి, జనసేన, బీజేపీ-వైసీపిల మద్య హోరాహోరీ పోటీలో ఓట్లు చీలిపోతే, ఏపీ కాంగ్రెస్‌ కనీసం 5-10 సీట్లు గెలుచుకున్నా ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పగలుగుతుంది. కానీ ఈసారి కూడా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే రాబోతోంది కనుక ఏపీ కాంగ్రెస్‌ను పూర్తి మెజార్టీతో గెలిపించినా కూడా ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క సమస్యను అది పరిష్కరించలేదు. కనుక ఏపీ కాంగ్రెస్‌కు ఒక్క సీటు లభించినా దానికి బోనసే అవుతుంది… ఏపీకి వృధాయే అవుతుందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories