కళ్యాణం, కక్కు వస్తే ఎవరూ ఆపలేరంటారు… అలాగే వైసీపికి, దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి ఒకదాని తర్వాత మరో కష్టం వచ్చి పడుతూనే ఉన్నాయి. ఎవరూ వాటిని ఆపలేకపోతున్నారు.
టిడిపి, జనసేనల పొత్తులే వద్దని మొత్తుకుంటే వాటితో బీజేపీ కూడా కలిసిందిప్పుడు. రేపు చిలకలూరిపేటలో మూడు పార్టీలు కలిసి నిర్వహించబోతున్న బహిరంగ సభల పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా వస్తున్నారు.
దాదాపు ఐదేళ్ళు వంగి వంగి దండాలు పెడితే, ఆ కృతజ్ఞత కూడా లేకుండా నిన్నగాక మొన్న కలిసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపడం మేలైన వ్యక్తికి ఎంత బాధ కలిగిస్తుందో ఎవరూ ఊహించుకోలేరు.
మరోపక్క చెల్లెమ్మలు షర్మిల, సునీతారెడ్డి ఇద్దరూ నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేసి అందరికీ ‘మేలు’ చేసేవాడి మనసు నొప్పిస్తూనే ఉన్నారు. పైగా వైసీపిలో నేతలందరూ బయటకు వచ్చేయండి. ప్రజలెవరూ వైసీపికి ఓట్లు వేయకండని ప్రెస్మీట్ పెట్టి మరీ చెపుతున్నారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.
అయినప్పటికీ చొక్కా మడత పెట్టి మొహానికి చిర్నవ్వు అంటించుకొని ర్యాంప్ వాక్, సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏపీ రాజకీయాలలో వేలు పెట్టడానికి వచ్చేస్తున్నారు. ఈరోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి విశాఖకు రాబోతున్నారు.
ఈ సభకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సహా కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ హాజరు కాబోతున్నారు. ఆఫ్కోర్స్… వారందరూ ఏకమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడలేరని అందరికీ తెలుసు. కనుక రేవంత్ రెడ్డి చేత జగన్ ప్రభుత్వం గురించి నాలుగు ముక్కలు మాట్లాడించడానికే ఈ వంకతో విశాఖకు రప్పించిన్నట్లు భావించవచ్చు.
తెలంగాణ సిఎం హోదాలో ఏపీకి వస్తున్న రేవంత్ రెడ్డి, సాటి సిఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తారో? రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపగలరో లేదో?అని అంటే తినబోతూ గారెల రుచి ఎలా ఉంది? అని అడిగిన్నట్లే ఉంటుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి శత్రువుల జాబితాలో నేటి నుంచి మరో నంబర్ పెరుగుతుంది. కనుక వైసీపిలో ‘నోరున్న మంత్రులు’ అందరూ ‘సిద్ధం’గా ఉండాలి… ఉండే ఉంటారు!




