నగరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ‘తిరుపతి పర్యటన మంత్రి’ రోజా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అవహేళన చేసి అధినేత జగన్మోహన్ రెడ్డిని మెప్పించి మంత్రి పదవి, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కూడా సంపాదించుకోగలిగారు. కానీ నగరి నియోజకవర్గంలో ఆమె ఒంటరి పక్షిగా మిగిలిపోయారు!
పర్యాటక శాఖ మంత్రి అంటే నెలకు మూడు సార్లు తిరుమల శ్రీవారిని, నాలుగుసార్లు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని దర్శనం చేసుకోవడమే అనుకున్నారు తప్ప ఏనాడూ మంత్రిగా బాధ్యతగా వ్యవహరించలేదు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కనీసం ఆలోచించలేదు.
ఆమె ఫోకస్ అంతా ఎప్పుడూ తిరుమల, తాడేపల్లి తప్పితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల మీదే ఉండేది కనుక నియోజకవర్గంలో పట్టు కూడా పెంచుకోలేదు.
ఇదే సమయంలో ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి వర్గం నగరిపై పూర్తి పట్టు సాధించింది. దీంతో నగరిలో పెద్దిరెడ్డి మద్దతు లేనిదే రోజా గెలిచే అవకాశమే లేదు.
ఆమె గెలుపుకు సహకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని ఆదేశించినప్పటికీ, నేటికీ వారిద్దరి మద్య శతృత్వం అలాగే ఉంది. దీంతో నగరిలో మంత్రి రోజాకు శత్రువులే తప్ప మిత్రులు లేకుండా పోయారు.
గత ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో రోజా కేవలం 2,681 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి ఏ ప్రభంజనం లేకపోగా అంతా వ్యతిరేక పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఆమె చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నందున టిడిపి ‘టార్గెట్ నియోజకవర్గాలలో’ నగరి కూడా ఒకటిగా ఉంది. అక్కడ నుంచి మళ్ళీ భాను ప్రకాష్ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు టిడిపితో పాటు జనసేన, బీజేపీల మద్దతు, రోజా వ్యతిరేక వర్గాల మద్దతు కూడా ఉన్నాయి. కనుక ఈసారి అవలీలగా భారీ మెజార్టీతో రోజాపై గెలిచే అవకాశం ఉంది.
ఏపీ అభివృద్ధిని పట్టించుకోకపోయినా ఈసారి ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుస్తామని జగన్ ఏవిదంగా చెప్పుకొంటున్నారో, అదేవిదంగా నగరి కోసం ఏమీ చేయకపోయినా ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్ ట్రిక్ కొడతానని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమ్మాల్సిందే!




