దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తన అనంతపురం ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. చంద్రబాబు హయాంలో ఈ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. విభజన తరువాత ఆంధ్రకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదే.
అయితే తమిళనాడు ప్రభుత్వ అధికారులతో… కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు కథనం సారాంశం. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పారిశ్రామిక రాయితీలపై… ప్రభుత్వం పునరాలోచన చేయటమే తరలింపునకు కారణమంటూ కథనంలో పేర్కొన్నారు. దీనిని ప్రభుత్వ వర్గాలు, కియా యాజమాన్యం ఖండించింది.
అయితే అంతర్జాతీయ మీడియాలో ఇటువంటి కథనం రావడమే ప్రభుత్వానికి తలవంపులు. పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఎక్కువ. దీనిని ఎలా ఎదురుకోవాలి అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. సహజంగా స్థానిక మీడియాలో వార్తలు వస్తే అది యెల్లో మీడియా సృష్టి అని కొట్టిపారేస్తారు. జాతీయ మీడియాలో అయితే చంద్రబాబు వ్యవస్థలను మానేజ్ చేశాడు అనొచ్చు.
అయితే ఈ విషయంలో అది అంతర్జాతీయ మీడియా. అది కూడా చాలా పేరు గల సంస్థలు ఈ వార్తలను ప్రచురించాయి. కనీసం ఆ వ్యాసం రాసినవారు తెలుగు వారు కూడా కాదు. రాజకీయమో, కులమో అంటగట్టి కొట్టిపారేయడానికి. దీనితో ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందే అని టీడీపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.



