ఇల్లలకగానే పండగ కాదన్నట్లు కల్వకుంట్ల కవితకు ‘టీఆర్ఎస్’ (తెలంగాణ రక్షణ సేన) పేరు దక్కినంత మాత్రాన పండగ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ పేరుపై సుమారు 700కి పైగా అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు అందడంతో, పార్టీ పేరు మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఆమెకు లేఖ రాసింది.
ఇది ఆమెకు పెద్ద షాకే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పేరుతో పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్లు తదితరాలు ముద్రించుకొని వాటితో ప్రజల మధ్యకు వెళ్ళారు. ఇలాంటి సమయంలో పార్టీకి మరో కొత్త పేరు అంటే ఆమెతో పాటు పార్టీ నేతలు కూడా నవ్వులపాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈసీ లేఖపై ఆమె స్పందిస్తూ, “ఈసీకి వచ్చిన అభ్యంతరాలన్నీ మాకు పంపిస్తే వాటిని పరిశీలించి మా సమాధానం చెప్పగలం. కానీ రెండే రెండు అభ్యంతరాలు పంపించి పార్టీ పేరు మార్చుకోమని సూచించడం సబబు కాదు. పార్టీ పేరు కాపాడుకోవడం కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాను” అని అన్నారు.
ఒకవేళ ఆమె న్యాయ పోరాటం చేసినా అక్కడ కూడా ఇదే సూచన రావచ్చు. ఎందుకంటే దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలలో ఈసీ కూడా ఒకటి. పార్టీ పేర్లు, ఎన్నికల నిర్వహణ, చిహ్నాల కేటాయింపు తదితర అంశాలపై దాని నిర్ణయాలలో చాలా బలమైన కారణం ఉంటే తప్ప న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు.
ఏ పార్టీ అయినా ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకునే సమయంలోనే ఐదు పేర్లు సూచించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక పేరుపై అభ్యంతరాలు వ్యక్తమైతే మిగిలిన నాలుగు పేర్లలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు ఈ విధానం ఉంటుంది. కవితకు టీఆర్ఎస్ పేరు కూడా అలాగే లభించింది.
కనుక ఈసీ కోరితే పార్టీ పేరు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.






