నిన్న విశాఖపట్నంలోని ఎల్జీ పొలిమెర్స్ కంపెనీ ముందు బాధితులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలతో కంపెనీ ముందు నిరసన తెలియజేశారు. రెండు రోజులకు పైగా అయినా ఒక్క అరెస్టు కూడా చెయ్యకపోవడం, నష్టపరిహారంతో సరిపెట్టే ప్రయత్నాలను వారు నిరసించారు.
అలాగే నష్టపరిహారం కాదని, కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ ఉదంతానికి వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సాక్షి పత్రిక తనదైన శైలిలో రాజకీయ రంగు పులిమింది. “బాధితుల ముసుగులో శవరాజకీయం’ అంటూ హెడ్డింగ్ పెట్టి కుటుంబసభ్యులని కోల్పోయిన వారి గుండె కోతని హేళన చేసింది.
అది తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రేరేపిత కిరాయి నిరసన అని తేల్చి చెప్పింది. ఇది ఇలా ఉండగా… ఈ గ్యాస్ లీక్ ప్రభావం విశాఖపట్నం పై ఒక దశాబ్దం పాటు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలలో దీర్ఘ కాలం పాటు నిమోనియా, కంటి సమస్యలు ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన 400కు పైగా స్థానికులు ఇప్పటికీ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటున్నారు. మరోవైపు విషవాయువు లీకైన ట్యాంక్ ను నిర్వీర్యం చెయ్యడానికి కేంద్రం నుండి వచ్చిన బృందాలు తలమునకలై ఉన్నాయి. సోమవారం నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు.





