తాజా ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో మీడియాతో మాట్లాడుతూ, “ఎవరో మోసం చేశారు… ఎవరో అన్యాయం చేశారు… అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఈ ఫలితాలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను చేయగలిగింది చేశాను. అయినా ఎందుకు ఓడిపోయామో తెలియదు! ప్రజలు తీర్పు భిన్నంగా ఉన్నా నేను దానిని తీసుకుంటాను.
ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నన వారికి అభినందనలు, వారిదిప్పుడు చాలా పెద్ద కూటమి. ఢిల్లీని శాశించే అంత బలంగా ఉంది వారికి.
జీవితంలో ఈ 5 ఏళ్ళు మినహా మిగిలిన కాలమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక ముందు ఎన్ని కష్టాలు పెట్టినా వాటికీ నేను ‘సిద్ధం’గానే ఉన్నాను.
ఎన్ని ప్రయత్నాలు చేసినా మా 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. ఈ ఓటమితో క్రుంగిపోము. పేదల పక్షాన్న నిలబడి పోరాడుతాము. మళ్ళీ ఇక్కడి నుంచే పైకి లేచి నిలబడతాం,” అని అన్నారు.
ఈసారి ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకుంటామని అది చూసి యావత్ దేశం నివ్వెరపోతుందన్న నోటితోనే జగన్ ఇప్పుడు ఈ మాటలు కూడా అన్నారు. తమ ఓటమిని చూసి తామే ఆశ్చర్యపోతున్నామన్నారు.
ఎవరో మోసం చేశారు… ఎవరో అన్యాయం చేశారని కానీ ఆధారాలు లేవనడం అంటే ఇంతకాలం గెలుస్తామని జగన్ చెప్పిన మాటలన్నీ అబద్దమనుకోవలసి ఉంటుంది.
ఒకవేళ ఎన్నికల సమయంలో జగన్ ఈ మాటలని ఉంటే వాటికి ఓ అర్దం ఉండేది. కానీ పోలింగ్ ముగిసి లండన్ వెళ్ళే ముందు ఐప్యాక్ టీమ్తో మాట్లాడినప్పుడు కూడా ‘గత ఎన్నికల కంటే ఈసారి వైసీపి ఎక్కువే వస్తాయని’ చెప్పుకున్నారు. అందుకు మీరందరూ ఎంతగానో తోడ్పద్దారంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుని వారితో సెల్ఫీలు కూడా దిగారు.
పోలింగ్ తర్వాత కూడా ఇంత నమ్మకంగా గెలువబోతున్నామని జగన్ చెప్పుకున్న నోటితోనే ఇప్పుడు మోసం, అన్యాయం జరిగిందంటూ కొత్త కధ చెపుతున్నారు.
అయితే 98 శాతం మందికి మేలు చేసినా 60 శాతం ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు?అంటే ప్రజలు తన ఆలోచనలు, విధానాలను తిరస్కరించారనే కదా?
అసలు 175 అనుకుంటే 11 సీట్లే ఎందుకు వచ్చాయి? అనే ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కనుక జగన్కి, వైసీపి నేతలకు తెలియదనుకోలేము.
కానీ తమ ఓటమికి తమ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, అసమర్దత, అవినీతి, అరాచకాలు, వైఫల్యాలే కారణం అని తెలిసి ఉన్నా ఒప్పుకోవడానికి, ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని అంగీకరించడానికి జగన్కు ఇంకా మనసు అంగీకరించడం లేదు. అందుకే ఎవరో మోసం చేశారు… ఎవరో అన్యాయం చేశారని ఓటమిని ఆ తెలియని ఎవరికో అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంతకాలం మా నమ్మకం… మా భవిష్యత్ నువ్వే అని అందరి చేత బలవంతంగా చెప్పించుకున్న జగన్ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఇంకా ఎన్ని కష్టాలు పెట్టినా భరించడానికి ‘సిద్దం’గా ఉన్నానని చెప్పేశారు. ఆయన వద్దనుకున్నా జరుగబోయేది కూడా అదే.




