సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార నియమాలు ఉంటాయి. అలాగే కేరళలోని శబరిమలై అయిదు గిరులపై కొలువై… చిన్ముద్రుని రూపంలో దర్శనమిచ్చే అయ్యప్పస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. ఋతుక్రమంలో ఉన్న మహిళలు తప్ప ఎవరైనా ఈ ‘మణికంఠ’ స్వామిని సందర్శించుకునే సౌలభ్యం ఉంది. అయితే మహిళలపై ఉన్న నిబంధనలు సడలించాలని అందరికీ అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టి వేసే సంప్రదాయం ఏదైనా ఉందా? ఏ ఆధారంతో మహిళలు ఈ దేవాలయంలోని వెళ్లకూడదని చెబుతున్నారు? దేవుడు సర్వాంతర్యామి… అలాంటి దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని… రాజ్యాంగ హక్కు కానంతవరకు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. శబరిమలైలో మహిళల ప్రవేశం నిషేదంపై గతంలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా దానికి మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.
అయితే అనాదిగా వస్తున్న ఈ ఆచారం పట్ల సుప్రీం తీర్పు కొందరి భక్తుల మనోభావాలను దెబ్బ తీయవచ్చు. అయితే ఇదే సందర్భంలో భక్తులంతా ముద్దుగా పిలుచుకునే ఆ ‘మణికంఠ’ స్వామిని మహిళలు కూడా దర్శించుకునే అవకాశం లభించినట్లయ్యింది. ఈ నెల 28వ తేదీన అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా తాజాగా చేసిన వ్యాఖ్యలు కార్యరూపం సిద్ధించుకుంటాయోమోనన్న ఆసక్తి అయ్యప్ప భక్తులలో నెలకొని ఉంది.



