సుప్రీంకోర్టులో అమరావతి పంచాయతీ… సశేషం!

YS-Jagan-Supreme-Courtఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగుతున్నట్లయితే దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ గర్వంగా చెప్పుకొంటూ ఉండేవారు. కానీ జగన్ ప్రభుత్వం దానిని వివాదాస్పదంగా మార్చడమే కాక సుప్రీంకోర్టులో పంచాయతీ పెట్టడంతో అందరూ సిగ్గుతో తలదించుకోవలసివస్తోంది.

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. దానిపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపి మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ‘గ్లాసులో సగం నీళ్ళున్నయని చెప్పుకోవచ్చు లేదా సగం గ్లాసు ఖాళీ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చనట్లు ఉన్నాయి.

ADVERTISEMENT

రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన ఏడు ఆదేశాలపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా వాటిలో నిర్ధిష్ట కాలపరిమితిలో రాజధాని నిర్మించాలనే ఒకే ఒక్క ఆదేశంపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఓ ప్రభుత్వంలా వ్యవహరించడం సరికాదని, రాజధాని నిర్మాణ విషయంలో నిర్ధిష్టమైన గడువు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘అశ్వత్థామ హతః కుంజరహ’ అన్నట్లు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులలో అసలు విషయాన్ని చెప్పకుండా, కాలపరిమితికి సంబందించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడం తమకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు జగన్ ప్రభుత్వం చెప్పుకొంటోంది.

అయితే సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులలో అత్యంత కీలకమైనది… ‘మూడు రాజధానులు ఏర్పాటుకి చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరించడం. అంటే ఈ విషయంలో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు సమర్ధించినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే అసెంబ్లీలో మళ్ళీ మూడు రాజధానులు ఏర్పాటుకి బిల్లు ప్రవేశపెడదామని ఎదురుచూస్తున్న జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.

ఈ కేసులో సంబందిత వ్యక్తులందరికీ నోటీసులు పంపించి ఈ కేసు తదుపరి విచారణను 31కి వాయిదా వేయడం జగన్ ప్రభుత్వానికి ఒక విదంగా ఊరట కలిగించే అంశమే అని చెప్పవచ్చు. అమరావతి నిర్మించకూడదని జగన్ ప్రభుత్వం ముందే ఫిక్స్ అయ్యింది కానీ మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేయకుండా కాలక్షేపం చేసేందుకు కూడా ప్రభుత్వానికి చాలా సమయం లభించింది.

నిజానికి సుప్రీంకోర్టు హైకోర్టు అన్ని ఉత్తర్వులపై స్టే విధించి మూడు రాజధానులు ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కనుక జగన్ ప్రభుత్వం వాటిని ఏర్పాటుచేయలేదు. కనుక ‘అమరావతి పంచాయతీ’ కధ ముగింపు లేని తెలుగు సీరియల్లాగ సాగాలని జగన్ ప్రభుత్వం కోరిక కూడా నెరవేరినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories