దాదాపు పదేళ్ల తర్వాత 2014లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దాదాపుగా రెండేళ్ళ పాటు సాగిన చంద్రబాబు పాలనపై ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ (సీఎంఎస్) సమగ్ర సర్వే నిర్వహించింది. సిఎంగా చంద్రబాబు పాలనా విధానం, మంత్రుల పనితీరుపై జరిగిన ఈ సర్వేలో ముఖ్యమంత్రి ఏకంగా 67 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.
రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సర్వేలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రజలు అభిప్రాయ పడ్డారు. అయితే చంద్రబాబు పనితీరు బాగానే ఉన్నా, సహకారం అందించాల్సిన మంత్రివర్గ సభ్యుల నుండి మాత్రం ఆశించిన మేర సహకారం అందడం లేదని సర్వేలో తేలిపోయింది. ఈ విషయంలో కేబినెట్ లోని ఏ ఒక్క మంత్రి కూడా చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా పని చేయడం లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు.
నిజానికి ఇదే అభిప్రాయాన్ని ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా విశదీకరించారు. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు కష్టపడుతున్నారని, అయితే సిస్టం సోర్సెస్ నుండి సరైన తోడ్పాటు కరువైందని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర క్యాబినెట్ ను దృష్టిలో ఉంచుకుని పవన్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని తాజా సర్వే చెప్పకనే చెప్పింది. ప్రజల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడంలో పవన్ విజయవంతమయ్యారని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.



