కొన్ని ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో సంక్షేమ పధకాలు అమలు చేస్తే, మరి కొన్ని వాటి అవసరం, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పధకాలు అమలు చేస్తూ ఉంటాయి. అటువంటిదే గత ప్రభుత్వం అమలుచేసిన అమ్మ ఒడి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం.
ఈ పధకం ప్రదానోదేశ్యం పేదరికం కారణంగా పిల్లలు చదువులకు దూరం కాకూడదని. గత ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ని ఏవిధంగా అమలు చేసిందో, చివరికి దాంతో ఏం సాధించాలనుకుందో, ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘తల్లికి వందనం’ ప్రారంభించింది. ఈ పధకంలో ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికీ రూ.13,000 చొప్పున తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్ధులకు ఈ పధకం వర్తింపజేస్తోంది.
ఈ పధకం ద్వారానే ఒక్కో విద్యార్ధి తరపున మరో రెండు వేలు చొప్పున ప్రభుత్వమే ఆయా పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తోంది. అంటే తల్లికి వందనం పధకం ద్వారా రూ. 15,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందన్న మాట!
నేటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రంలో 67.47 లక్షల మంది విద్యార్థులకు మొత్తం రూ.10,120.78 కోట్లు వారి తల్లులు లేదా సంరక్షకుల ఖాతాలలో ప్రభుత్వం జమా చేస్తోంది.
గత ప్రభుత్వం ఈ పధకంతో వైసీపీ ఓటు బ్యాంకు బలోపేతం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేయడం వలన బెడిసి కొట్టింది.
కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలనే తపనతో ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఈ పధకాన్ని వర్తింపజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనిస్తే ఈ పధకం ఆశించిన సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది.
ఓ పక్క తల్లికి వందనం పధకం అమలు చేస్తూనే మళ్ళీ విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, స్కూలు బ్యాగులు, మధ్యాహ్న భోజన పధకం వంటివి కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది.
గత ప్రభుత్వం కూడా అమలు చేసింది కదా?వీటి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది? అనే సందేహం కలుగవచ్చు.
గత ప్రభుత్వం జగన్ ఫోటోలతో వీటన్నిటినీ అమలుచేసి వీటి ద్వారా కూడా ఆయనకి, వైసీపీకి పబ్లిసిటీ చేసుకొని ఎన్నికలలో రాజకీయ ప్రయోజనం పొందలనుకుంది. కానీ కూటమి ప్రభుత్వ ముద్రతోనే ఇవన్నీ అమలు చేస్తోంది తప్ప టీడీపి రంగులు వేసుకోవడం లేదు. సిఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు వేసుకోవడం లేదు. ఆయన పేరు కూడా చెప్పుకోవడం లేదు.
అంతేకాదు.. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్ధుల ఫోటోలు, వివరాలు న్యూస్ పేపర్లలో వేయించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి ప్రతిభని లోకానికి చాటిస్తున్నారు.
ఇదంతా ఎందుకు అంటే, కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పధకాన్ని రాజకీయ అవసరాల కోసం కాక, విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్ కోసమే అమలుచేస్తోందని నొక్కి చెప్పేందుకే!






