కరోనావైరస్ కారణంగా ఇప్పటికే ఒక నెలకు పైగా మూసివేయబడిన ఫిల్మ్ థియేటర్ల భవిష్యత్తు ప్రశ్నర్ధకం అయ్యింది. సమీప భవిష్యత్తులో ఎక్కడా సాధారణ స్థితి వచ్చే పరిస్థితి కనబడకపోవడంతో థియేటర్ యజమానులు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు సినిమా నిర్మాతల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు.
ఈ తరుణంలో థియేటర్ యజమానులకు తమ భవిష్యత్తుపై పదేపదే ఇన్ సెక్యూరిటీ పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వారి వ్యాపారంపై ఓటీటీ ప్రభావాన్ని తగ్గిస్తున్నాం అనుకుని తప్పటడుగులు వేస్తున్నారు. థియేటర్ విడుదలైన 100 రోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యే చిత్రాలను మాత్రమే రాష్ట్రంలోని థియేటర్లు ప్రదర్శిస్తాయని తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
సూర్య యొక్క 2 డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యొక్క అన్ని భవిష్యత్ చిత్రాలను వారు నిషేధించిన ఒక రోజు తరువాత ఈ నిర్ణయాన్ని వారు ప్రకటించారు. జ్యోతిక యొక్క పోన్ మాగల్ వంధల్ థియేటర్లలో విడుదల చెయ్యకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
భవిష్యత్తులో తమ వ్యాపారానికి ప్రాణాంతకమైన ఈ ధోరణిని అరికట్టాలని థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చాయి. ఇతర రాష్ట్ర సంఘాలు కూడా దీనిని అనుసరిస్తాయా? అనేది చూడాలి. చేస్తే మాత్రం ఇది ఆత్మహత్యా సదృశ్యం అనే చెప్పుకోవాలి. సినిమా అనేదాని మీదే థియేటర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు థియేటర్లు తెరిచే అవకాశం ఎలాగూ లేదు, ఓటీటీల వల్ల సినిమా బ్రతికే అవకాశం కొంతయినా ఉంది. ఈ తరుణంలో దానిని కూడా చెడగొడితే… థియేటర్ యాజమాన్యాలు తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్టు అవుతుంది.





