‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి పెదవి విప్పారు. ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… “చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చిటికేస్తే రాష్ట్రమంతా కదిలే పరిస్థితి ఉంది, వీళ్ళకు పార్టీలు పెట్టాల్సిన పని లేదు, రాజకీయాల్లోకి రాకుండానే రాజ్ కుమార్ మాదిరి రాష్ట్రమంతా ఏదైనా చేసే స్థితికి ఎదగాలనుకునే వారిలో తానూ ముఖ్యుడిని” అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు చిరు ఏం చెప్పినా పేపర్లలో ‘హెడ్ లైన్స్’లో ఉండేవి, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయో తెలిసిందే… చూడబోతుంటే పవన్ పరిస్థితి కూడా అలాగే అవుతుందన్న భావనను వ్యక్తపరిచారు.
“ప్రశ్నించడమే ప్రధాన అజెండాగా చెప్పిన పవన్, ప్రశ్నించాల్సిన సమయం వస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని, అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు, అయితే మంచి సమాజం కావలన్న కోరిక ఉంది, దానికి తగిన విధమైన పరిజ్ఞానం ఉంది, మంచి మనసుంది, కానీ సరైన సమయంలో స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ కు అతి పెద్ద మైనస్ గా అభివర్ణించారు. వారికున్న ఇమేజ్ ను సరిగా ఉపయోగించుకోకుండా ఒకరు ఆబాసు పాలయ్యారు, మరొకరు కూడా అదే బాటలో పయనిస్తున్నారన్న ఆవేదనే తనలో ఉందని” ఈ సందర్భంగా తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
“రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యామ్నాయం కోసం వేచిచూస్తున్నారని, జనాన్ని ఆకర్షించగల కెపాసిటీతో పాటు ప్రజల నమ్మకం పవన్ సొంతమని, అయితే దానిని సరైన దిశలో పెట్టాలని, ప్రజలతో ఈ ‘దాగుడు మూతలు’ ఆడకూడదని, ప్రజల్లోకి రావాలని, ప్రజలతో మమేకం అయిపోవాలని కోరారు. ఇతర పార్టీలతో కలవాల్సిన అవసరం పవన్ కు లేదని, కొత్త తరం కావాలని, కొత్త మనుషులతో కూడిన కొత్త నాయకత్వం రావాలని, అయితే ఈ “దొంగ ఆటలు” ఆపేయాలని, చేసుకుంటే సినిమాలు చేసుకుంటూ ప్లానింగ్ తో చేసుకుంటే పవన్ ‘జనసేన’ 2019 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను” తమ్మారెడ్డి వెలిబుచ్చారు.





