బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా – నానాపటేకర్ వ్యవహారం ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇటీవల అమెరికా నుంచి భారత్ కు వచ్చిన తనుశ్రీ పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను సెట్స్లో లైంగికంగా వేధించాడని ఆరోపించి సంచలనం సృష్టించింది. అంతేగాక నాడు కొందరు దుండగులు ఆమె ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసిన క్లిప్ వైరల్ అయ్యింది.
[m9ad]
తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్ ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని… ఆమెపై పరువునష్టం దావా వేయనున్నట్టు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తనుశ్రీ… తనను నానా పటేకర్ బెదిరిస్తున్నాడని, రాజ్థాకరే పార్టీ ఎంఎన్ఎస్ నుంచి కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని, స్వయంగా రాజ్థాకరేనే తనను బెదిరించారని, దాడి తప్పదని హెచ్చరించారని పేర్కొంది.
ముంబై పోలీసులు తనను కలిశారని, 24 గంటలూ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. తన ఇంటి చుట్టూ సాయుధ పోలీసులు పహారా కాస్తారని చెప్పారని పేర్కొంది. తనకు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చిన ముంబై పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపింది. తనుశ్రీ దత్తాకు పోలీస్ భద్రతపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
హోంమంత్రి దీపక్ వంత్ కేసార్కర్ మాట్లాడుతూ… ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలోనే పోలీసు రక్షణ కల్పించామని, నానాపటేకర్కు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఓ వ్యక్తిని అనుమానించడం తగదని పేర్కొన్నారు. అతడు నటుడు మాత్రమే కాదని, ప్రముఖ సోషల్ వర్కర్ కూడా అని వివరించారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో బాలీవుడ్ వర్గాలు కూడా రెండుగా విడిపోయాయి. నానాపటేకర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆరోపిస్తున్న తనుశ్రీకి సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, స్వర భాస్కర్, రిచా చద్దా, ఫరాన్ అక్తర్ తదితరులు మద్దతు ప్రకటించారు. అలాగే నానాపటేకర్ అలాంటి వ్యక్తి కాదని చెప్పిన సెలబ్రిటీలూ ఉన్నారు.



