ఈ నెల 8న జరగబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల ప్రజాస్వామ్య పక్షంగా జరిగే అవకాశాలు కనిపించడం లేదని దానితో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే కొన్ని చోట్ల పార్టీ క్యాడర్ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు.
పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా కొన్ని చోట్ల కార్యకర్తలు పోటీలో ఉండబోతున్నారు. టీడీపీకి పట్టున్న స్థానాల్లో పరిస్థితిని చేజార్చుకోకూడదన్న ఆలోచనతో వారు ఉన్నారు. తదనుగుణంగా పార్టీ నిర్ణయానికి అతీతంగా అలాంటి చోట్ల శ్రేణులు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. తమకు బీ-ఫోరంలు ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు.
పార్టీని నిలబెట్టుకునే క్రమంలో పార్టీ నిర్ణయాన్ని కూడా ధిక్కరించే కార్యకర్తలు ఉండటం టీడీపీ బలం. అందుకే ఆ పార్టీని అంత తేలికగా తీసుకోకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక టీడీపీ పోటీ నుండి విరమించుకున్న చోట బీజేపీ, జనసేన నుండి పోటీ పెద్దగా ఉండదని అధికారపక్ష నాయకులు భావిస్తున్నారు.
అదే సమయంలో బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోకుండా తిరుపతి ఉపఎన్నిక మీదే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. పార్టీ నాయకులంతా తిరుపతిలోనే ఉండి ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో తమ విజయం నల్లేరు పై బండి నడకే అని అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.





