ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీలో జోష్ పెరిగింది. ప్రతిపక్షంలో నీరసం ఆవహిస్తుంది. జగన్ అవినీతి కేసులు తాజాగా వివేకా హత్య కేసుతో జగన్ ను చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న జగన్ నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ టీడీపీకి ఆయుధంగా మారింది. నిన్న జగన్ సుమారు 41 పేజీల అఫిడవిట్ ఇచ్చారని, అందులో 27 పేజీల్లో ఆయన నేర చరిత్రే ఉందని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
దీనితో ఆ పార్టీ నేతలకు ఊపిరి సలపడం లేదు. ఎన్నికల అఫిడవిట్లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. ]తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అందరి అభ్యర్థుల అఫిడవిట్లు ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో పెడుతుంది.
అలా బయటకు వచ్చిన జగన్ అఫిడవిట్ సోషల్ మీడియాతో పాటు వాట్స్ అప్ లో కూడా చక్కర్లు కొడుతుంది. ఇది ఎన్నికలలో నష్టం చెయ్యవచ్చని వైకాపా నేతలు ఆందోళన పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు తన అఫిడవిట్ లో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు నిరసన పెట్టిన కేసు మాత్రమే ఉందని తెలిపారు. తొలిసారి ఎన్నికలలో పోటీ చేస్తున్న లోకేష్ మీద ఒక్క కేసూ లేదు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన మీద కేసులు ఏమీ లేవని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.



