మహిళల భద్రత కోసమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో మొట్టమొదటి దిశ పోలీస్స్టేషన్ ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోలీస్ స్టేషన్ లో మొట్టమొదటి కేసు టీడీపీ మహిళా ఎమ్మెల్యే నమోదు చెయ్యడం విశేషం.
సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని రాజమండ్రి దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకర కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు కావడం కొసమెరుపు.
గతంలో ఇదే అంశం ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీని మీద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్స్టేషన్కు తరలివచ్చారు.
ఆదిరెడ్డి భవాని టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ ఎర్రన్నాయుడు కుమార్తె. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆమె రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్నా ముప్పై వేల భారీ మెజారిటీ తో ఘనవిజయం సాధించారు.



