మళ్ళీ ఎన్డీయేలోకి టిడిపి… ఏపీకి చాలా అవసరమే!

Amit-Shah-Chandrababu-Naidu

టిడిపి మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం అర్దరాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు టిడిపి మళ్ళీ ఎన్డీయే కూటమిలో చేరాల్సిందిగా చంద్రబాబు నాయుడుని కోరిన్నట్లు తెలుస్తోంది. కానీ దీని గురించి పార్టీలో చర్చించుకున్న తర్వాత నిర్ణయం చెపుతామని చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై కూడా చర్చించేందుకే ఈ సమావేశమని వేరే చెప్పక్కరలేదు. అయితే దీనిపై ఇరువర్గాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. నేడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్ళి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అవుతారు. బహుశః ఆ తర్వాత మూడు పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు అమిత్ షా, జేపీ నడ్డాలకు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ, అరాచక పరిస్థితుల గురించి వివరించి, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమీషన్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత నిఖచ్చిగా, పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన్నట్లు తెలుస్తోంది.

టిడిపి, జనసేన, బీజేపీల పొత్తుల కంటే టిడిపి మళ్ళీ ఎన్డీఏలో చేరడం, ఆ పార్టీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా మేలు కలుగవచ్చు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి, ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనల కూటమి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

కనుక గాడి తప్పిన ఏపీని మళ్ళీ చక్కబెట్టుకోవలసి ఉంది. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ళుగా అమరావతిని పాడుబెట్టడమే కాకుండా అక్కడ రాజధాని ఏర్పాటు కాకుండా చేసేందుకు అనేక సమస్యలు కూడా సృష్టించింది. జగన్‌ ప్రభుత్వం ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయకపోగా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఆర్ధికభారం కూడా పెంచేసుకుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది.

కనుక ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు చాలా అవసరం. కనుక టిడిపిలో ఎన్డీయే కూటమిలో చేరితే ఆ పార్టీకి మంచిది… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా మంచిదే.

ADVERTISEMENT
Latest Stories