తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మళ్లీ వేగం పుంజుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో సహా పలువురు ఐపీఎస్ అధికారులను పిలిచి ఈ కేసులో సాక్షులుగా వాంగ్మూలాలు తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో జనవరి 3న ముందుగా మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు.
ఈ విషయం ఆయనే స్వయంగా బయటపెట్టారు. సిఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు కేసులతో తమను వేధిస్తే, ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుందని గుర్తుంచుకోవాలని హరీష్ రావు సిట్ అధికారులను హెచ్చరించారు.
హరీష్ రావు తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం. కనుక కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఎప్పటిలాగే హైకోర్టులో పిటిషన్లు వేసి ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ కేసు బయటపడింది. అప్పుడే ఈ కేసులో కేసీఆర్కు నోటీసులు జారీ చేసి జైలుకు పంపిస్తారని అనుకున్నారు.
కానీ తమ ప్రభుత్వం ఆయనను టచ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకే దారితీశాయి.
రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసులో హరీష్ రావు, కేసీఆర్లకు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకోవాలా? లేక మొన్న బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేసీఆర్ చాలా రెచ్చిపోయారా?
తోలు తీస్తానని కాంగ్రెస్ మంత్రులను హెచ్చరించినందుకా? అనే సందేహం కలుగుతుంది. ఈ పరిణామాలన్నీ ఈ కేసు వెనుక రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే భావనకు బలం చేకూరుస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ, ఈ కేసులో కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగితే అది చాలా గొప్ప సంచలన విషయమే అవుతుంది.
ఒకవేళ ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేసినా, నేర నిరూపణ చేసి శిక్ష పడేలా చేయలేకపోతే, అదే విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శాపంగా కూడా మారే అవకాశం ఉంది.




