ఎంకి పెళ్ళి సుబ్బి చావు అన్నట్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలోని వైసీపి ఎమ్మెల్యేల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మార్చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి ‘ఎల్లో మీడియా వార్తలని’ సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంతవరకు ఖండించడం లేదు. అంటే ఆ వార్తలు నిజమేనని స్పష్టమవుతోంది.
ఆ 65 మందిలో ఇప్పటికే అద్దంకి, మంగళగిరి రెండు వికెట్స్ పడ్డాయి. తాజాగా మరో మూడు వికెట్స్ పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు పర్వత పూర్ణచంద్రరావు, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబులను పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.
జిల్లా ఇన్చార్జి మిధున్ రెడ్డి వారు ముగ్గురినీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని రాబోయే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. దీంతో ముగ్గురూ షాక్ అయ్యారు. త్వరలోనే వారి స్థానాలలో వేరేవారిని అభ్యర్ధులుగా ఖరారు చేస్తామని, ముగ్గురూ వారికి తప్పనిసరిగా సహకరించాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందని మిధున్ రెడ్డి ముందే హెచ్చరించిన్నట్లు తెలుస్తోంది. అయితే వారు ముగ్గురూ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతోనే మాట్లాడుకొంటామని జవాబు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
ఇంతకాలం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి తమకు ఎప్పుడు పిలుపు వస్తుందా… ఎప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ నియోజకవర్గం సమస్యల గురించి చెప్పుకొందామా… అని వైసీపి ఎమ్మెల్యేలు ఎదురుచూసేవారు.
కానీ ఇప్పుడు అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినా అందరూ ఉలిక్కిపడుతున్నారు. తాడేపల్లికి రమ్మనమని ఎప్పుడు పిలుపువస్తుందో అని అందరూ హడలిపోతున్నారు పాపం!
కానీ ‘ఓ సారి కమిట్ అయితే నా మాట నేనే వినను,’ అన్నట్లు వారి అధినేత 65మందిని మార్చేయాలని ఫిక్స్ అయిపోతే తగ్గేదేలే! కనుక వైసీపి ఎమ్మెల్యేలు బీపీ మాత్రలు వేసుకొని తాడేపల్లి పిలుపులకి సిద్దంగా ఉండటం మంచిది.




