2016 ఆంగ్ల సంవత్సరంలో వైసీపీలో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర్ర వరకు అసంతృప్త వాదం బయటకు వెల్లడి కాకపోయినప్పటికీ, ఈ ఏడాదిలో మొదలైన ప్రక్రియ రోజులు గడుస్తున్న కొద్ది తన పరిధిని పెంచుకుంటోంది. తాజాగా నెల్లూరు జిల్లా, గూడూరు ఎమ్మెల్యే సునీల్ తన పార్టీ అధినేత జగన్ కు ‘ఉగాది’ ఆఫర్ ను ప్రకటించారు.
మంత్రి నారాయణతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన సునీల్ టిడిపిలో చేరికను ధృవీకరించారు. చర్చలు పూర్తయిన అనంతరం ప్రకటించిన సునీల్, ఈ నెల 8వ తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నానని ప్రకటన చేసారు. దీంతో ఆంగ్ల సంవత్సరమే కాదు, తెలుగు కొత్త సంవత్సరాదిగా పరిగణించే ‘ఉగాది’ నాడు జగన్ తీపి రుచి చూస్తారో లేదో గానీ ‘చేదు’ మాత్రం చవిచూడడం ఖాయం.
అయితే రానున్న రెండు రోజుల్లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారని విజయవాడ సెంటర్ నియోజక వర్గపు ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. చూడబోతుంటే 2016 ఉగాది పర్వదినం జగన్ కు దీర్ఘకాలంగా గుర్తుండిపోయే అనుభూతిని మిగిల్చేలా కనపడుతోంది.





