కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను పంపారు.
గత కొన్ని రోజులుగా సీజేపీ అధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తూ నీట్ సమస్యకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్, మిత్ర పక్షాలు, బిజేపియేతర ప్రాంతీయ పార్టీలు కూడా వారికి సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడంతో ఈ సమస్యకి కేంద్ర ప్రభుత్వం తెరదించింది.
ఆయన రాజీనామా కోసమే సీజేపీ అధ్వర్యంలో విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు కనుక ఇక్కడితో వారు విరమించవచ్చు.
వారికి అండగా నిలబడి పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించగలిగినందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, దేశంలోని బిజేపియేతర పార్టీలు తమ పోరాటాలతో కేంద్రం మెడలు వంచి రాజీనామా చేయించామని గొప్పగా చెప్పుకోవచ్చు.
మౌనంగా ఉండిపోయిన పార్టీలు హమ్మయ్య ‘శీల పరీక్ష’ ముగిసిందని నిట్టూర్చి మళ్ళీ రొటీన్ రాజకీయాలు చేసుకోవచ్చు.
ఇంతకు ముందు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులని పార్లమెంటులో సమర్ధంగా అడ్డుకొని తొలి విజయం సాధించిన కాంగ్రెస్, మిత్రపక్షాలకు ఈ రెండో విజయం అంత కంటే చాలా ఎక్కువ సంతోషం కలిగిస్తుందని చెప్పవచ్చు.
అయితే కొన్ని ప్రశ్నలు.. ఇంతకీ నీట్ సమస్య పరిష్కారం అయిపోయినట్లేనా? మరెన్నడూ పేపర్లు లీక్ అవకుండా అడ్డుకున్నట్లేనా? మోడీ కంచుకోట క్రాక్ చేయడం ఎలాగో కాంగ్రెస్ పార్టీకి ఫార్ములా కనిపెట్టేసినట్లేనా? అయితే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిపోవడం ఖాయమేనా? కాంగ్రెస్కు ఎలా ముందుకు వెళ్ళాలో తెలిసింది. కనుక వాట్ నెక్స్ట్?






