మరో 10-15 రోజులలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు హడావుడిగా 8 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేశారు. వెంటనే ఏపీ శాసనసభ సెక్రెటరీ జనరల్ రామాచార్యులు శాసనసభలో ఈ 8 స్థానాలు ఖాళీ అయ్యినట్లు ఈసీకి సమాచారం పంపారు.
వైసీపి నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టిడిపిలో చేరారు కనుక వారిపై అనర్హత వేటు వేశారంటే అర్దంచేసుకోవవచ్చు. కానీ వారిపై వేటు వేయడం వలననే టిడిపి నుంచి వైసీపిలో చేరిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాం, మద్దాలి గిరిధర్లపై కూడా వేటు వేసుకోవాల్సి రావడం విచిత్రం.
వల్లభనేని వంశీ (గన్నవరం), వాసుపల్లి గణేశ్ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాలి గిరిధర్ (గుంటూరు వెస్ట్)లపై అనర్హత వేటు వేయడానికి వైసీపి ఏ కధ చెప్పినప్పటికీ ఈసారి వారు నలుగురికి టికెట్లు ఇవ్వకపోవచ్చని చెప్పేసిన్నట్లే భావించవచ్చు. టిడిపిని కాదని జగన్ను నమ్ముకొని వైసీపిలో చేరితే సరిగ్గా ఎన్నికలకు ముందు తమపై అనర్హత వేటు వేయడాన్ని వారు జీర్ణించుకోవడం కష్టమే.
ఇక టిడిపిలో చేరిన వైసీపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం దేనికంటే ఆ నాలుగు నియోజకవర్గాలలో వారిని ఎదుర్కొని గెలవడం కష్టమనే భయంతోనే కావచ్చు.
వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), ఆనం రాంనారాయణ రెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) ముగ్గురూ నెల్లూరు జిల్లాకే చెందిన చాలా సీనియర్ నాయకులు. జిల్లా రాజకీయాలపై వారికి మంచి పట్టుంది. వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించడంతో టిడిపిలో చేరిపోయారు. వారు ముగ్గురూ వెళ్ళిపోవడంతో నెల్లూరులో వైసీపి చాలా బలహీనపడింది. ఇక ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)అమరావతి రైతుల మద్దతు, సానుభూతి రెండూ ఉన్నాయి.
కనుక ఈ నలుగురిని ఎన్నికల బరిలో నుంచి తప్పించడానికి అనర్హత వేటు వేయడమే మంచి ఉపాయమని వైసీపి మేధావులు భావించి ఉండవచ్చు. తమ ఎత్తులు పారవని వారికీ తెలుసు. కానీ ఎదుటవాడి కంట్లో పొడిచే ప్రయత్నంలో వైసీపి కళ్ళు వైసీపియే పొడుచుకోవడమే విచిత్రం… కదా?




